AP heatwave alert: ఏపీ ( Andhra Pradesh) అప్పుడే మండిపోతోంది. వేసవి ప్రారంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిప్పుల సెగలు కక్కుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.f మార్చి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే.. నడి వేసవిలో రాళ్లు పగిలేలా ఎండలు ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. తాజాగా భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికలు చూస్తే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు.. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగల్పులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ కు దాటవచ్చని అంచనా ఉంది. సంక్రాంతి తర్వాతనే ఎండల తీవ్రత కనిపించగా.. రాబోయే మూడు నెలలు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయని సంకేతాలు అందుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి.
ఐఎండి హెచ్చరికలు..
భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏపీలో రాయలసీమతో పాటు కోస్తా జిల్లాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మార్చి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఏప్రిల్ నాటికి విషమంగా.. మే నాటికి మరింత విషమంగా పరిస్థితి మారనుంది. సగటున 3 నుంచి 15 రోజుల వరకు తీవ్రమైన వడగల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీనివల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తోంది. సంక్రాంతి తరువాత వర్షాల జాడలేదు. చలి తీవ్రత చాలా వేగంగా తగ్గుముఖం పట్టింది. ఇవన్నీ ఉష్ణోగ్రతల పెరుగుదలకు సూచికలేనని తెలుస్తోంది.
Also Read: బీఆర్ నాయుడిని వైసిపి ఎందుకు టార్గెట్ చేసినట్టు?
ఎల్ నినో ప్రభావంతో..
పసిఫిక్ మహాసముద్రంలో ‘లా నినా’ ప్రభావం తగ్గింది. బలహీన పడింది కూడా. అదే సమయంలో ‘ఎల్ నినో’ పరిస్థితి ఉండడంతో ఎండల తీవ్రత మరింత పెంచే అవకాశం ఉంది. వేసవిలో ప్రమాద ఘంటికలు తప్పవని తేలిపోయింది ఈ పరిస్థితుల దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మధ్యాహ్నం వేళలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రాలు అప్రమత్తం..
మరోవైపు భారత వాతావరణ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీచేసింది. విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి వేతనదారులు, రైతులకు వడగల్పులపై ముందస్తు అవగాహన కల్పించాలని సూచించింది. వన్యప్రాణుల సంరక్షణ పై కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది.