Pawan Kalyan : ఆపదలో ఉంటే ఆదుకుంటాడు. నిస్వార్థంగా సేవ చేస్తాడు. జనసైనికులు చనిపోతే ఇంటికెళ్లి మరీ రూ.5 లక్షలు సాయం చేస్తాడు. పార్టీ కార్యకర్తలను సొంత బిడ్డల్లా చూసుకుంటాడు. వారిపై దాడులు జరిగితే అక్కడికెళ్లి మరీ నిలదీస్తాడు. బయట ప్రపంచానికి ఈ అన్యాయంపై నినదిస్తాడు. అందుకే పవన్ ను అసలు సిసలు లీడర్ గా జనాలు గుర్తిస్తున్నారు. తాజాగా ఒక జనసైనికుడి మరణం పవన్ ను కదిలించింది. కరిగేలా చేసింది. ఆ బాధను ప్రకటన రూపంలో పవన్ ను పంచుకునేలా చేసింది. ప్రతీ కార్యకర్త విషయంలో పవన్ పడే బాధ ఇందులో మనకు అర్థమవుతోంది.
శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యుత్ ప్రమాదానికి గురై జనసేన క్రియాశీలక కార్యకర్త గొర్ల వసంత కుమార్ మరణించడం చాలా బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వసంత కుమార్ ప్రజా సేవలో చురుకుగా ఉంటాడు. విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని కంప్లైంట్ చేయటానికి వీడియో తీస్తుండగా ఈ ప్రమాదం జరిగి మరణించడం శోచనీయమని పవన్ అన్నారు.
గతంలో కూడా ఇదే విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు వసంత కుమార్ ఫిర్యాదు కూడా చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగటం విచారకరం. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక జనసేన నాయకులు చెబుతున్నారు. ఏమైనప్పటికీ ఇటువంటి ప్రమాదం జరగటం, 27 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఎంతైనా బాధాకరం. వసంత కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పవన్ శ్రద్ధాంజలి ఘటించారు. జనసేన పార్టీ తరఫున వసంత కుమార్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.