AP Liquor Brands: రాష్ట్రంలో 103 రకాల జే బ్రాండ్ మద్యం అమ్మకాల వెనుక సీఎం జగన్ బినామీల డిస్టలరీ సంస్థలు ఉన్నాయని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా..అవన్నీ చంద్రబాబు హయాంలో అనుమతిచ్చిన బ్రాండ్లేనని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు ఇందులో ఏది నిజమో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. జంగరెడ్డిగూడెంలో కల్తీ మద్యం ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో (జగన్ మద్యం) ‘జె’ బ్రాండ్ల అమ్మకాలు సాగుతున్నాయంటూ టీడీపీ గత కొద్దిరోజులుగా ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శాసనసభలో సైతం పెద్ద దుమారమే రేగింది. సమగ్ర విచారణకు టీడీపీ డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ స్పందించారు. రాష్ట్రంలో 103 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చింది చంద్రబాబేనని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఇలా బురద జల్లుతున్నారనిఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఏయే బ్రాండ్లకు అనుమతిచ్చింది సీఎం జగన్ చదివి వినిపించారు.

అయితే దీనిపై టీడీపీ శాసనసభా పక్ష నాయకుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలు ప్రకారం జగన్ సీఎం అయ్యాక కొత్త బ్రాండ్లకు అనుమతిచ్చినట్టు తెలిసిందన్నారు. మద్యం తయారీ కంపెనీలు దరఖాస్తు చేసుకునే సమయంలో మాకు ఫలానా బ్రాండ్, ఫలానా పేరుతో కావాలని అడిగాయని చెప్పారు. వాటినే చంద్రబాబు అమ్మించేసినట్టు చెబుతుండడం పక్కదారి పట్టించడమేనన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల పేరిట ఉన్న డిస్టలరీలను అధికారంలోకి రాగానే సీఎం జగన్ లాక్కున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, సుధాకర్ యాదవ్, ఆదికేశవులనాయుడు పేరిట మద్యం తయారీ కంపెనీలు లేవన్నారు. అయ్యన్నపాత్రుడు పేరుతో ఉన్న డిస్టలరీని విజయసాయిరెడ్డి లాక్కున్నారని చెప్పారు.
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది..?

మద్యం తయారీ కంపెనీలు టీడీపీ నాయకుల పేరిట ఉన్నప్పుడు గత మూడేళ్లుగా ఎందుకు నిలిపివేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యడు నారా లోకేష్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు నిలిపివేసిన ప్రభుత్వం మద్యం తయారీ కంపెనీల విషయంలో ఎందుకు ఉపేక్షించిందన్నారు. పొరుగు రాష్ర్టాలకు చెందిన నమ్మకస్థులైన నేతలను బినామీలుగా చేర్చుకొని సీఎం జగనే 103 మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ప్రధాన విపక్షం ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరోపణలు చేస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేస్తూ అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఈమద్యం బ్రాండ్ల తయారీ ఎవరు చేస్తున్నారన్నది తెలియకపోవడం విశేషం
Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ: జగన్ కేబినెట్ లో ఎవరు ఇన్..? ఎవరు ఔట్?
