Onion Price Crisis: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ ఈ రైతుకు మేలు కాదు కదా.. దారుణమైన నష్టాన్ని మిగిల్చింది. కానీ విని ఎరుగని స్థాయిలో కన్నీటిని జ్ఞాపకం గా ఇచ్చింది. దీంతో ఆ రైతు పడుతున్న వేదన మామూలుగా లేదు. కుమిలి కుమిలి ఏడుస్తున్న అతడి కన్నీరు మన దేశ పాలకులకు.. రైతుల శ్రమ దోచుకుంటున్న వ్యాపారులకు చెంప పెట్టు లాంటిది.
మనదేశంలో ఉల్లిపాయలకు ప్రభుత్వాలను మార్చిన ఘనత ఉంది. ఎందుకంటే ఉల్లి ధరలు పెరిగితే మధ్య తరగతి, పేదల బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే ఉల్లిగడ్డలు లేకుండా ఏ వంట కూడా సాగదు. ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు పెరిగితే సగటు ఆడవాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వంట ఇంటి కష్టాలు వాళ్లకు మాత్రమే తెలుసు. ఉల్లి ధరలు ఒక నిర్ణీత స్థాయిలో ఉంటేనే బాగుంటుంది. అవి అమాంతం పెరిగితే పేదలు, మధ్యతరగతివారు తీవ్రంగా ఇబ్బంది పడతారు.
అలాగని పెరిగిన ధరలు రైతులకు అంతగా ప్రయోజనాన్ని కలిగించవు. ఎందుకంటే రైతుల నుంచి కొనుగోలు చేసిన మధ్యవర్తులు మాత్రమే భారీగా లాభాలు సంపాదిస్తూ ఉంటారు. ఉల్లి ధరలు పెరిగితే మధ్యవర్తులు లాభపడతారు. ధరలు తగ్గితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మనదేశంలో ఉల్లి పంటకు పెట్టింది పేరైన మహారాష్ట్రలో.. జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా రైతుల దయనీయస్థితికి అద్దం పడుతుంది.
మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీ నగర్ మార్కెట్ ఏరియాలో ఓ రైతు 1,262 కిలోల ఉల్లిపాయలను విక్రయించాడు. దీనికి అతడికి కేవలం 1,262 మాత్రమే దక్కాయి. అంటే ఈ లెక్కన కేజీకి ₹1 మాత్రమే అతనికి లభించింది. ఉల్లిపాయలను అమ్మడానికి అతడు లోడింగ్, తూకం, రవాణా కోసం ఏకంగా 1,263 రూపాయలను ఖర్చు చేశాడు. అంటే అతడికి కష్టానికి ప్రతిఫలం దక్కలేదు. పైగా జేబు నుంచి అదనంగా రూపాయి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో రైతులు వ్యవసాయం ఎలా చేస్తారు.. కనీసం గిట్టుబాటు కాదు కదా.. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఎలా బతుకుతారు.. రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటే ఇక రైతులు ఎలా బతుకుతారు…ఎలా బాగుపడతారు.. పండించిన పంటను గిట్టుబాటు ధరకు కూడా అమ్ముకో లేకపోతే అంతకుమించిన దరిద్రం ఇంకేముంటుంది.