Site icon OkTelugu

Swami: ఇదేమీ ‘స్వామి’.. ఇంతలా దిగజారిపోవాలా?

Swami: ఏపీలో జగన్ సర్కారు తన అనుకునే వారికో రూల్.. ఇతరులకో రూల్ వర్తింపజేస్తుందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెడుతుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనికితోడు జగన్ తన అనుకూల, సన్నిహితులకు లబ్ధి చేకూరేలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండటం కొత్త వివాదానికి తెరలేపుతోంది.

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే వ్యక్తుల్లో విశాఖ పీఠాధిపతి స్వరూపనంద స్వామిజీ ఒకరు. భూకబ్జాలు, ఆశ్రమాల్లో అసాంఘిక కార్యకలాపాలు, బెదిరింపులు వంటి ఎన్నో ఆరోపణలు, కోర్టుల్లో కేసులు వంటి వాటికి ఆయన కేరాఫ్ గా నిలుస్తుంటారు. ఆధ్యాత్మిక ముసుగులో దందాలకు పాల్పడుతారనే విమర్శలు సైతం ఆయనపై ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే స్వామి స్వరూపనంద వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారనే అందరికీ తెల్సిందే.

వైఎస్ జగన్ సీఎం కావడానికి తాను ఎన్నో హోమాలు, యాగాలు చేశానని అందువల్లే ఆయన సీఎం అయ్యారని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ స్వామిజీ అన్నిరకాలుగా లబ్ధిపొందుతున్నారు. జగన్ తన శిష్యుడి చెప్పుకుంటూ  ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న ప్రయోజనాన్ని వదలకుండా వాడేసుకుంటున్నారు. ఇటీవల తన ఆశ్రమానికి ఓ 15ఎకరాల విలువైన స్థలాన్ని ఏపీ క్యాబినేట్ భేటిలో కేటాయింపజేసుకున్నారు.

అలాగే తనపై భూకబ్జా ఆరోపణలున్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నారు. ఆఖరికి తిరుమలలో పీఠం తరపున కట్టిన భవనానికి ఇచ్చిన స్థలం ఎక్కువ దాంట్లో ఆశ్రమం కట్టి రెగ్యూలరైజ్ చేయించుకున్నారు. ఇవన్నీ కూడా గురువుగారి స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. అయితే తన ఆశ్రమానికి చెందిన ఓ చిన్న ఓమ్ని బస్‌కు మూడేళ్లపాటు ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా కమర్షియల్ వాహనాలకు ప్రభుత్వం మూడునెలలకు ఒకసారి సీట్ల సంఖ్య ఆధారంగా పన్నులు నిర్ణయిస్తుంది. సీటుకు రూ.500 నుంచి రూ.600 వరకు వాహనాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ పన్నును కూడా స్వామిజీకి చెందిన ఓమ్ని బస్‌కు ప్రభుత్వం మూడేళ్ల పాటు మినహాయింపు ఇచ్చింది. ఇంత చిన్న మొత్తానికి కూడా స్వామిజీ సీఎం జగన్ వద్ద తనకు ఉన్న పలుకుబడిన వాడుకున్నారంటే మిగతా విషయాల్లో ఎలా వాడి ఉంటారోననే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఓమ్ని బస్ వ్యవహారం బయటకు రావడంతో స్వామిజీ లీలాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చే అవకాశం కన్పిస్తోంది. అయితే సీఎం జగన్ తన శిష్యుడే కాబట్టి ఆయనకు ఏమి ఫరాక్ పడకపోయినా రేపు పొద్దున కొత్త సర్కారు వస్తే మాత్రం ఆయన చిట్టా మొత్తం బయటికి వచ్చి అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారిన ఓమ్ని బస్ వ్యవహరాన్ని ప్రభుత్వ పెద్దలు ఎలా కవర్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version