ఏపీలో ఎన్నికల కమిషన్.. ప్రభుత్వం మధ్య వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. అసలే.. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వీరి ‘పంచాయితీ’ మరింత ముదురుతోంది. ఓ వైపు ఎన్నికలకు సహకరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఏమాత్రం సహకరించడం లేదు. అటు ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రచ్చను కొనసాగిస్తున్నారు.
Also Read: ఆంధ్రాలో ఇగోల మధ్య ఘర్షణ ఇదీ!
ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో గవర్నర్కు, ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖాస్త్రాలు సంధించిన నిమ్మగడ్డ.. జగన్ ప్రభుత్వం పై మరోమారు యుద్ధం ప్రకటించారు. జగన్ ప్రభుత్వంపై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిటిషన్పై విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రతివాదిగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను చేర్చడానికి అనుమతి ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల విషయంలో తనకు సహకరించని ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: జగన్ ప్లాన్ సక్సెస్: ఏపీలో ఏకగ్రీవాల జాతర
ఎన్నికల నిర్వహణకు తమకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని.. కోర్టు ఆదేశాలను సైతం పాటించడం లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. నేడు రేపు కోర్టుకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. మరోపక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఓటర్ల జాబితా సవరణ చేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఎన్నికల నిర్ణయంతో చాలామంది ఓటు హక్కును కోల్పోతున్నారని ఎన్నికలను రద్దు చేయాలని పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేసినా , ఈ దశలో ఎన్నికలను రద్దు చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఎన్నికలను అడ్డుకోవాలని చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించకుండా పోయింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ప్రవీణ్ ప్రకాష్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఎస్కు సూచించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్ససత్యనారాయణ విజయసాయి రెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రభుత్వ పెద్దలందరినీ టార్గెట్ చేస్తూ చివరకు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఒకపక్క ఎన్నికల నిర్వహణ విషయంలో బిజీగా పర్యటనలు చేస్తూనే, మరోపక్క ప్రభుత్వంతో పెద్దఎత్తున పోరాటం చేస్తున్నారు. దీంతో ఏపీ ఎన్నికలు హాట్ టాపిక్గా మారాయి.