Free Bus Travel
Free Bus Travel: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తోంది. వారం రోజులుగా ఎటువంటి పత్రాలు లేకుండానే ఉచిత ప్రయాణాన్ని అందించారు. ఇక నేటి నుంచి(డిసెంబర్ 15) మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ప్రతీ ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.
వర్చువల్గా మీటింగ్..
మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి–మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళ నుంచి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాప్ట్ వేర్ను సంస్థ అప్ డేట్ చేసింది. ఆ సాప్ట్ వేర్ను టిమ్ మెషిన్లలో ఇన్స్టాల్ చేయడం జరుగుతోంది’’ అని తెలిపారు.
ఈ పత్రాలు తప్పనిసరి..
ఈమేరకు టిమ్ మెషీన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుంది. మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి.. విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లకు అందుబాటులో ఉంటుంది.