NEET Exam Paper Leak: నీట్ పరీక్ష పత్రాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తయారుచేస్తారు.. పరీక్ష కూడా అదే స్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ నీట్ ప్రశ్నపత్రం ఎలా బయటికి వచ్చింది.. కొంతమంది ముఠా సభ్యులు ఇలా దీనిని బయటికి తీసుకు రాగలిగారు.. ఇప్పుడు ఈ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి.
నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదుగురిని అరెస్ట్ చేసింది. దాదాపు 24 మందిని అదుపులోకి తీసుకుంది. దేశ వ్యాప్తంగా మంగళవారం అనేక ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు జరిపింది. ఫోన్లు .. లాప్టాప్ లు స్వాధీనం చేసుకుంది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించింది. సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతానికి చెందిన మంకీలాల్ , వికాస్, దినేష్ ఉన్నారు. హర్యానా రాష్ట్రంలోని గురు గ్రామ్ ప్రాంతానికి చెందిన యశ్ యాదవ్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన శుభం ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు..
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు బృందాలు ఏకంగా 15 మందికి పైగా విద్యార్థులను విచారించాయి. ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో కోచింగ్ సెంటర్ల పాత్రలేదని.. తమకు ఆ దిశగా ఆధారాలు లభించలేదని పోలీసులు ప్రకటించారు. ఒక కన్సల్టెన్సీ వ్యవస్థ.. విద్యార్థుల పేరుతో అనేక మాధ్యమాలలో గెస్ పేపర్ అనే పిడిఎఫ్ ఫైల్ సర్కులేట్ చేసింది. ఆ పేపర్ మొత్తాన్ని ప్రింట్ తీసి విద్యార్థులకు ఓ జిరాక్స్ సెంటర్ యజమాని అందించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గెస్ పేపర్ పేరుతో ఇది చాలామందికి చేరింది. దీనిని ముందుగా కేరళ రాష్ట్రంలో ఎంబిబిఎస్ అవుతున్న రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యార్థి.. రాజస్థాన్లోని ఒక హాస్టల్ ఓనర్.. కొంతమంది విద్యార్థులకు పంపించాడు. అక్కడ నుంచి ఇంకా అనేకమంది విద్యార్థులకు అది చేరింది. కేరళ రాష్ట్రంలో ఎంబిబిఎస్ అవుతున్న రాజస్థాన్ విద్యార్థికి గెస్ పేపర్ ను అదర్ స్నేహితుడు పంపించాడు. అది అక్కడ నుంచి గురు గ్రామ్ ప్రాంతంలోని ఒక వ్యక్తి ద్వారా రాజస్థాన్ కు చేరినట్టు తెలుస్తోంది. అయితే ఆ హాస్టల్ ఓనర్ ఈ వ్యవహారాన్ని పోలీసులు దృష్టికి తీసుకువచ్చాడు. అతడే ఈ వ్యవహారంలో కీలక సమాచారాన్ని పోలీసులకు అందించాడు.
నీట్ ప్రశ్నపత్రం మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రణ అయింది. అక్కడ నుంచి పేపర్ బయటకు వచ్చినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పూణేలో ఒక మహిళను పోలీసులు ఇప్పటికే అధువులకు తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సిబిఐ అధికారులు సందర్శించారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.. రాజస్థాన్లో పోలీసులు అరెస్ట్ చేసిన దినేష్ బిజెపిలో పనిచేస్తున్నాడని కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. అతడు జైపూర్ గ్రామీణ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని విమర్శించారు.
అశోక్ చేసిన విమర్శలను బిజెపి నాయకులు ముఖేష్ తీవ్రంగా ఖండించారు. కాగా, దినేష్ అరెస్టు తర్వాత అతడి తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.. తన కొడుకు దినేష్ స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. ఈ కేసు వ్యవహారంతో తన భర్తకు సంబంధం లేదని.. తమ కుమారుడి నీట్ పరీక్ష కోసం షికారు ప్రాంతంలో ఉంటున్నాడని దినేష్ భార్య రజని విలేకరులతో వెల్లడించారు.