‘చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ..’ పెట్టే ఇబ్బంది మామూలుగా ఉండదన్నాడు వేమన. ఇప్పుడు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ముఖ్యమంత్రి జగన్ కు ఇదేవిధంగా తయారయ్యారు. జగన్ బెయిల్ రద్దు చేయించే కార్యక్రమం నుంచీ.. అవకాశమున్న ప్రతి విషయంలోనూ వైసీపీ సర్కారును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రఘురామ. అయితే.. విపక్షంలో ఉన్న నేతలు ఎవరైనా ఇలా చేస్తే.. పరాయి పార్టీవాళ్లు అని సర్ది చెప్పుకునేవారేమో.. కానీ, సొంత పార్టీ ఎంపీ, తాను సీటు ఇస్తే గెలిచిన వ్యక్తి.. తనను ధిక్కరించి, ఇబ్బంది పెట్టడమా? అనే అసహసనం జగన్ లో నిండిపోయింది.
అందుకే.. వైసీపీ నేతలు రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ కార్యం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదుగానీ.. అప్పటి వరకు ఇంటిపోరు మాత్రం వైసీపీకి తప్పేట్టుగా లేదు. ఇదిలా ఉంచితే.. ఒకవేళ రఘురామపై అనర్హత వేటు వేస్తే.. రాష్ట్రంలో వారి సంగతేంటీ? అనే చర్చ కూడా సాగుతోంది. ఇతర పార్టీల తరపున గెలిచి, వైసీపీతో అంటకాగుతున్నవారు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు.
వీరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి ఓపెన్ గానే మద్దతు పలుకుతున్నారు. ఇక, జనసేన ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ కూడా జగన్ కే జైకొడుతున్న సంగతి తెలిసిందే. మరి, రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేస్తే.. రాష్ట్రంలో వీరిపైనా వేటు తప్పదా? అనే చర్చ కూడా సాగుతోంది.
రఘురామపై లోక్ సభలో అనర్హత వేటు పడితే.. రాష్ట్రంలో వీరిపై వేటు వేయాలని ఖచ్చితంగా డిమాండ్ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఇన్నాళ్లూ.. టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వైసీపీకి మద్దతు పలుకుతుంటే.. చంద్రబాబు సైలెంట్ గానే ఉన్నారు. ఓడిపోయాం కాబట్టి.. వెళ్లే వాళ్లను వెళ్లనీ అనుకున్నారేమోగానీ.. వారిపై యాక్షన్ తీసుకోవాలని ఏమీ కోరలేదు. అటు.. పవన్ కూడా తన పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఏవిధంగానూ స్పందించలేదు. అయితే.. రఘురామపై వేటు పడితే.. రాష్ట్రంలో వైసీపీతో అనైతిక బంధం సాగిస్తున్న వారిపైనా అదేవిధమైన చర్య తీసుకోవాలని కోరే అవకాశం ఉందంటున్నారు.
అదే జరిగితే.. రాష్ట్రంలో ఆరు ఉప ఎన్నికలు ఖాయం. ఇప్పటి వరకు అధికార పార్టీకి ఎక్కడా ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగల్లేదు. ఈ ఉప ఎన్నికలు గనక జరిగితే.. ఒక పార్టీలో గెలిచి, అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాన్ని కూడా విపక్షాలు పరిశీలిస్తున్నాయని అంటున్నారు. ఆ విధంగా.. అనర్హత వేటు అనేది ఒక్క రఘురామతోనే పోయే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.