Vijayasai Reddy Vs Purandeshwari: తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది బిజెపి హై కమాండ్ పెద్దల వ్యవహార శైలి. బిజెపి జాతీయ స్థాయి ప్రయోజనాలకే పెద్దపేట వేస్తున్నారు. రాష్ట్ర పార్టీని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఇదే అదునుగా ఏపీలో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఢిల్లీ పెద్దలను గౌరవిస్తూ.. రాష్ట్ర బిజెపి నేతలను మాత్రం అగౌరవపరుస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దూకుడు కనబరుస్తున్నారు. అయితే ఆమెపై సిద్ధాంత పరంగా ఆరోపణలు చేయాల్సిన వైసిపి నేతలు.. చులకన భావంతో మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే టిడిపికి పనిచేయడం అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఆమె తన మరిది చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఒకరి తర్వాత ఒకరు కుటుంబ పరమైన విమర్శలు చేస్తున్నారు. కానీ బిజెపి పెద్దలు కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదు.
ఢిల్లీ పెద్దలంటే వినయ విధేయతలు ప్రదర్శించే విజయసాయిరెడ్డి సైతం పురందేశ్వరి పై ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి పై సైతం విమర్శలు కురిపిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలను ఘోరంగా విమర్శిస్తున్నా బిజెపి పెద్దలు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. సొంత పార్టీ నేతలను అగౌరవ పరుస్తున్నా ఏమీ అనలేని నిస్సహాయ స్థితికి కారణం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వాస్తవానికి వైసీపీ సర్కార్ పై పోరాటం చేయాలని పెద్దలు సూచిస్తూ వచ్చారు. ఇప్పుడు పురందేశ్వరి చేస్తున్న పని కూడా అదే. కానీ వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అప్పుల విషయంలో అడ్డగోలుగా సహకరిస్తూ… వేలకోట్లు తెచ్చుకునే దుబారా చేయడం కళ్ళ ముందు కనిపిస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రశ్నించకపోతే రాజకీయాలు ఎందుకు చేయడమనేది రాష్ట్ర బిజెపి నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. బిజెపి హై కమాండ్ మనసులో ఏముందో తెలియాలి.