Boat Accident India: తల్లిని మించిన యోధురాలు ఈ ప్రపంచంలో ఉండరు. తల్లిని మించిన త్యాగమూర్తి ఈ భూగోళంలో ఎక్కడ వెతికిన కనిపించదు. అమ్మ అంటే అనురాగం.. అమ్మ అంటే ఆప్యాయత.. త్యాగానికి అమ్మ నెలువెత్తు రూపం. అందువల్లే అన్నిచోట్ల భగవంతుడు తాను ఉండలేక ఈ భూమ్మీద అమ్మను సృష్టించాడు.
తన పిల్లల కోసం అమ్మ ఏమైనా చేస్తుంది. చివరికి తన ప్రాణం పోతున్నా సరే పిల్లలకు ప్రాణం పోస్తుంది. అందుకే అమ్మను మించిన త్యాగమూర్తి ఈ భూమండలంలో ఎవరూ ఉండరు. ఈ తల్లి కూడా అటువంటిదే. కళ్ళముందు చావు కనిపిస్తున్నప్పటికీ.. కన్న కొడుకును కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడింది. మరణం తనను ఆవహిస్తున్నప్పటికీ.. తన పిల్లాడి ప్రాణం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె పోరాటం విఫల యత్నంగానే మిగిలిపోయింది.. కొడుకును కాపాడుకునేందుకు ఆమె పెట్టిన కన్నీళ్లు.. ఆమె పడిన ఇబ్బందులు ఆ నీటిలోనే కలిసిపోయాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కనిపించిన దృశ్యాలు గుండెను మెలుపెడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతంలో బర్గీ డ్యాం లో గురువారం ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చాలామంది గల్లంతయ్యా. వారి ఆచూకీ కనిపెట్టేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. వారు సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో ఒక దృశ్యం కనిపించింది. అది కాస్త వారితో కన్నీరు పెట్టించింది. నాలుగు సంవత్సరాల బాబును అదిమి పట్టుకుంది. వారి చుట్టూ లైఫ్ జాకెట్ కూడా ఉంది. కుమారుడు నీటిలో మునిగిపోతుండగా.. అతడిని కాపాడేందుకు ఆ తల్లి వేదన పడినట్టు అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
బర్గి డ్యాం జబల్పూర్ జిల్లాలోని నర్మదా నది మీద నిర్మించారు. ఈ రిజర్వాయర్లో గురువారం ఒక పడవలో 29 మంది ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బంది ప్రయాణించడం మొదలుపెట్టారు. అయితే అది తిరగబడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. విపరీతమైన గాలుల వల్ల రిజర్వాయర్ ప్రాంతంలో నీరు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిందని ప్రయాణికులు గుర్తించారు. అయితే ఆ పడవను వెనక్కి పంపాలని సిబ్బందిని కోరినప్పటికీ.. గాలి తీవ్రతకు ఆ మాటలు వారికి వినిపించలేదు. దీంతో సిబ్బంది అలాగే ముందుకు వెళ్లారు..
ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులకు సమాచారం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొందరిని రక్షించారు. ఈ క్రమంలోనే అధికారుల పరిశీలనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రయాణికులను తీసుకెళ్తున్న క్రమంలో నిర్వాహకులు ఎటువంటి జాగ్రత్తలు పాటించలేదు. పడవ మునిబోతున్నప్పుడు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది పార్థివ దేహాలను బయటకు తీశారు. 15 మందిని అధికారులు రక్షించారు. మిగతా వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.