కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోడీషా ప్లాన్?

దొరికితేనే దొంగ.. దొరకపోతే దొరే.. కానీ దొరికేలా చేయడానికి అధికారం కావాలి.. చట్టం మన చుట్టమైతే పగోడు కూడా పాదాక్రాంతమవుతాడని కేంద్రంలో బీజేపీ వచ్చాక తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తన చేతిలో ఉన్న సీబీఐ, ఈడీ లాంటి వాటితోనే దేశంలో రాజకీయాలను శాసిస్తోంది బీజేపీ. కేంద్రంలో అధికారం బీజేపీకి అదనపు బలం అవుతోంది.. తమపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇరుకునపెడుతున్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తాజాగా టార్గెట్ చేసింది. అయితే నిజానికి ఇటు కాంగ్రెస్, అటు […]

Written By: NARESH, Updated On : July 9, 2020 3:06 pm
Follow us on


దొరికితేనే దొంగ.. దొరకపోతే దొరే.. కానీ దొరికేలా చేయడానికి అధికారం కావాలి.. చట్టం మన చుట్టమైతే పగోడు కూడా పాదాక్రాంతమవుతాడని కేంద్రంలో బీజేపీ వచ్చాక తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తన చేతిలో ఉన్న సీబీఐ, ఈడీ లాంటి వాటితోనే దేశంలో రాజకీయాలను శాసిస్తోంది బీజేపీ.

కేంద్రంలో అధికారం బీజేపీకి అదనపు బలం అవుతోంది.. తమపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇరుకునపెడుతున్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తాజాగా టార్గెట్ చేసింది. అయితే నిజానికి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండూ సుద్దపూసలు కాదు.. మన దేశంతో కయ్యానికి కాలుదూస్తున్న చైనా నుంచి ఇద్దరూ విరాళాలు పొందారు. కానీ అధికారంలో ఉండి బీజేపీ సేఫ్ జోన్ లో ఉండగా.. ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ విచారణను ఎదుర్కొంటోంది. అంతే తేడా..

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

తాజాగా సోనియాగాంధీ కుటుంబానికి కేంద్రంలోని మోడీ సర్కార్ షాక్ ఇచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాందీ మెమోరియల్ ట్రస్ట్ ల ఉల్లంఘనలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ట్రస్టులకు మనీ ల్యాండరింగ్ ద్వారా చైనా సహా వివిధ దేశాల నుంచి అక్రమంగా నగదు వచ్చిందని ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటువంటి ట్రస్టులకు నిధులపై ఇప్పటిదాకా సమర్థంగా నిరూపించబడలేదు. అయినా ఐటి, పిఎంఎల్‌ఎ మరియు ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడానికి బీజేపీ రెడీ కావడం నిజంగానే రాజకీయ కక్షసాధింపు అని కాంగ్రెస్ వాదులు ఆరోపిస్తున్నారు.

భారత్ -చైనా సరిహద్దు ఘర్షణ అనంతరం పీఎం మోడీ కేర్ కు చైనా నుంచి విరాళాలు అందాయని సోనియా, రాహుల్ గాంధీ విమర్శించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు కూడా అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రి రవిశంకర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే చైనాకు మోడీ లొంగిపోయారని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల మృతిపై ఇరుకునపెట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ ఈ ప్రతికార రాజకీయానికి పూనుకుందని అర్థమవుతోంది.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని బలహీనపరచడానికే బీజేపీ ఈ ఎత్తు వేసిందనే అపవాదు ఉంది. సోనియా, రాహుల్ గాంధీ సహా ఇతర కీలక కాంగ్రెస్ సీనియర్లను జైలుకు పంపడం లేదా కోర్టు మెట్లు ఎక్కేలా శిక్షలు వేయించడం.. వారి ఇమేజ్ ను జనాల్లో డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా సోనియా కుటుంబాన్ని మోడీ టార్గెట్ చేశారని అర్థమవుతోంది.

2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ నాయకత్వాన్ని విశ్వసనీయతను దెబ్బతీయడానికి బీజేపీ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకులందరూ కోర్టు కేసులను ఎదుర్కొంటారు. చాలా మంది 70 ఏళ్ల పైబడిన వారు కావడంతో తిరిగి పోరాడడానికి వారికి సంకల్పం సరిపోదు.. రెండో తరం నాయకత్వం కాంగ్రెస్ లో లేకపోవడం మైనస్. రాహుల్ శక్తి సామర్థ్యాలు తక్కువ. జ్యోతిరాధిత్య సింధియా లాంటి యువ కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరిపోయారు.కాబట్టి బీజేపీతో 2024 ఎన్నికల్లో పోరాడడం కాంగ్రెస్ కు తలకు మించిన భారమవుతుంది. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే బీజేపీ ఈ ప్లాన్ వెనుక ఉద్దేశంగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

-ఎన్నం