Temple for Jagan : అభిమానం సల్లగుండ: జగన్ కు గుడికట్టిన ఎమ్మెల్యే

దేశ‌స్వాతంత్రం కోసం పోరాడిన మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌ను పెట్ట‌డం ఒక‌ప్ప‌టి విధానం. ఆ త‌ర్వాత చ‌నిపోయిన రాజ‌కీయ నాయ‌కుల విగ్ర‌హాల‌ను కూడా రోడ్ల‌ కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ట్రెండ్ ఏమంటే.. బ‌తికున్న పొలిటీషియ‌న్ల విగ్ర‌హాలు కూడా పెట్టేస్తున్నారు. పాలాభిషేకాలు చేసేస్తున్నారు. మ‌రి, ఇది కూడా పాత‌బ‌డింద‌ని అనుకున్నారో.. లేక మ‌రే ఇత‌ర కార‌ణ‌మైనా ఉందో గానీ.. ఏకంగా గుళ్లు క‌ట్టేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి గుళ్లు క‌ట్టేందుకు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పోటీపడ‌డం.. ఒకరు నిర్మాణం పూర్తిచేయ‌డం కూడా […]

Written By: Bhaskar, Updated On : August 16, 2021 1:48 pm
Follow us on

దేశ‌స్వాతంత్రం కోసం పోరాడిన మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌ను పెట్ట‌డం ఒక‌ప్ప‌టి విధానం. ఆ త‌ర్వాత చ‌నిపోయిన రాజ‌కీయ నాయ‌కుల విగ్ర‌హాల‌ను కూడా రోడ్ల‌ కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ట్రెండ్ ఏమంటే.. బ‌తికున్న పొలిటీషియ‌న్ల విగ్ర‌హాలు కూడా పెట్టేస్తున్నారు. పాలాభిషేకాలు చేసేస్తున్నారు. మ‌రి, ఇది కూడా పాత‌బ‌డింద‌ని అనుకున్నారో.. లేక మ‌రే ఇత‌ర కార‌ణ‌మైనా ఉందో గానీ.. ఏకంగా గుళ్లు క‌ట్టేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి గుళ్లు క‌ట్టేందుకు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పోటీపడ‌డం.. ఒకరు నిర్మాణం పూర్తిచేయ‌డం కూడా జ‌రిగిపోయింది.

ముందుగా జ‌గ‌న్ కు గుడి క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావు. పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించిన చోట‌నే జ‌గ‌న్ కు గుడి క‌డ‌తాన‌ని ఆయ‌న గ‌తంలో చెప్పారు. ప్ర‌స్తుతం ఆ గుడి నిర్మాణం కొన‌సాగుతోంది కూడా. అయితే.. అది పూర్తి కాకుండానే.. మరో ఎమ్మెల్యే.. జ‌గ‌న్ గుడి నిర్మాణం మొద‌లు పెట్ట‌డం.. పూర్తి చేయ‌డం కూడా జ‌రిగిపోయింది.

చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు గుడి నిర్మించారు స్థానిక ఎమ్మెల్యే మ‌ధుసూద‌న్ రెడ్డి. జ‌గ‌న్ కు గుడి ఎందుకు క‌ట్టాడో కూడా చెప్పారు ఎమ్మెల్యే. ఓడిపోయిన త‌న‌కు మ‌ళ్లీ టికెట్ ఇచ్చి గెలిపించార‌ని, అందువ‌ల్ల త‌న అభిమానాన్ని ఇలా చాటుకున్నాన‌ని చెప్పారు. అంతేకాదు.. రాముడికి హ‌నుమంతుడిలా తాను జ‌గ‌న్ వెంట ఉంటాన‌న్న మ‌ధుసూద‌న్ రెడ్డి.. భార్యా బిడ్డ‌లా..? జ‌గ‌నా? అని అడిగితే తాను జ‌గనే కావాల‌ని కోరుకుంటాన‌ని కూడా చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ నిర్మించిన‌ ఆల‌యంలో ఆయ‌న విగ్ర‌హంతోపాటు వైసీపీ మేనిఫెస్టోల‌ని న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల వివ‌రాలు కూడా పొందు ప‌రిచారు. ఈ గుడిలో జ‌గ‌న‌న్న అద్దాల మ‌హ‌ల్ పేరుతో నిర్మించి, అందులో ప‌థ‌కాల పేర్ల‌ను నిక్షిప్తం చేశారు. మొత్తానికి.. జ‌గ‌న్ కు నిర్మించిన తొలి గుడి ఇదే కాబోతోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నారు. మ‌రి, ఇంకా ఎమ్మెల్యేలు ఎవ‌రైనా గుళ్లు క‌డ‌తారేమో చూడాలి.