Mann Ki Baat 100th Episode: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేపట్టిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ఇప్పటి వరకూ 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. వందో ఎపిసోడ్పై బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఎపిసోడ్ను ఎక్కువ మంది వినేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా వందో ఎపిసోడ్లో మోదీ ప్రసంగం వినేలా ప్రభుత్వం చర్యలు చేపట్టంది.
పార్టీలకు అతీతంగా..
మన్కీబాద్ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3న ’మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియా, డీడీ నెట్వర్క్లో ’మన్ కీ బాత్’ ప్రసారం అవుతోంది. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ బడావో, వాటర్ కన్జర్వేషన్, ఆయుష్, ఖాదీ తదితర అంశాలు ఆయా ఎపిసోడ్లో ప్రస్తావించడం, అంతగా గుర్తింపునకు నోచుకోని వ్యక్తులను వెలుగులోకి తేవడం సహా అనేక అంశాలతో ఈ రేడియో ప్రోగ్రాం జనబాహుళ్యానికి దగ్గరైంది.
రూ.వంద ప్రత్యేక నాణెం విడుదల..
మన్కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా ప్రత్యేకంగా వంద నాణెన్ని కూడా విడుదలచేస్తున్నారు. ఏప్రిల్ 30 జరిగే మన్కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్ను విడుదల చేయనున్నారు. ఈ డినామినేషన్ ఇంత వరకూ అధికారికంగా లేదు. అందుకే కేవలం ఒకే ఒక్క రూ.100 కాయిన్ మాత్రమే ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్ను వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు. కాయిన్ ముందు అశోక స్తంభం ఉండనుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది.
పలుమార్లు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన
మన్కీ బాత్కార్యక్రమంలో భాగంగా ఎందరో తెలుగువారిని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగ పాఠంతో ప్రపంచానికి పరిచయం చేశారు.
– స్వచ్ఛ భారత్ పై రామోజీరావు చేస్తున్న సేవలను కొనియాడారు.
– తెలంగాణాలోని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వర్షాకాలంలో ప్రతీ నీటిబొట్టును వృథా కానివ్వకుండా వాటిని కాలువలుగా మళ్లించి నీటికుంటలను నిర్మించారు. ప్రధాని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజల దృఢ సంకల్పాన్ని గుర్తు చేశారు.
– బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో 10 టన్నుల వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయత్నాన్ని నరేంద్రమోదీ ప్రశంసించారు.
– ‘ల్యాబ్ టు ల్యాండ్’ మంత్రంతో తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డి వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషినీ ప్రశంసించారు.
– మేడారం జాతరనూ ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్లోని…
– ఏపీలో విజయనగరం జిల్లాలో వయోజన విద్యను ప్రోత్సహించేందుకు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన కృషికిగాను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రశంసలు కురిపించారు.
– విజయవాడకు చెందిన శ్రీనివాసా పడకండ్ల అనే వ్యక్తి ఆటో మొబైల్ సంబంధిత వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నాడు. ప్రధాని మన్ కీ బాత్లో శ్రీనివాసా పేరును ప్రస్తావించారు.
– నంద్యాలలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించిన కేవీ సుబ్బారెడ్డిని కూడా ప్రధాని మన్ కీ బాత్ సందర్భంగా గుర్తు చేశారు. – కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో పండించే బంగినపల్లి మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తారనే విషయాన్ని ప్రధాని మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రస్తావించారు.
– భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు.
80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం..
మోదీ వందో మన్కీ బాత్ ఎపిసోడ్ను ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో అగ్రరాజ్యం అమెరికాలోని వైట్హౌస్ కూడా ఉంది. అక్కడ కూడా.. ప్రత్యేక అనుమతులు తీసుకుని ప్రసారం చేయనున్నారు. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి.. జీ20 సదస్సుల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇక, నగరాలు.. పట్టణాలు.. నియోజకవర్గాలు(మొత్తం 547 పార్లమెంటుస్థానాల్లో), గ్రామాల్లోనూ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి.. ప్రసారం చేస్తారు. దీనికి గాను మొత్తం రూ.100 కోట్లు విడుదల చేసేందుకు మోడీ సంతకం చేశారు.
దేశ ప్రజలకు ఎంతో మేలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి నెలా ప్రజలతో మన్ కీ బాత్ పేరుతో రేడియోలో జరిపే సంభాషణల్లో మనకు ఆత్మస్థైర్యాన్ని, స్ఫూర్తిని అందిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దేశ ప్రజల్లో అనేకమంది మౌనంగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని, అంతర్జాతీయ స్థాయిలో దేశం తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తున్నారని ప్రధానమంత్రి మొత్తం ప్రపంచం దృష్టికి తన ప్రసంగాల ద్వారా తీసుకువస్తున్నారని అంటున్నారు.