Rahul Gandhi vs PM Modi: రాహుల్ గాంధీని పార్లమెంట్ లో అడ్డుకున్న మోడీ.. కారణం అదే

Rahul Gandhi vs PM Modi: సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో జరిగిన చర్చలో భాగంగా రాహుల్ గాంధీ పై విధంగా స్పందించారు..

Written By: Anabothula Bhaskar, Updated On : July 1, 2024 6:38 pm

PM Modi vs Rahul Gandhi faceoff

Follow us on

Rahul Gandhi vs PM Modi: “జమ్ము కాశ్మీర్ ను రెండు ముక్కలు చేశారు. మణిపూర్ రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే పట్టించుకోవడం లేదు. వ్యవసాయ చట్టాల వల్ల 700 మంది చనిపోతే సంతాప తీర్మానం కూడా ప్రకటించలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం ఆ విషయం ప్రస్తావించలేదు. ఈ దేశం మొత్తం రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకొచ్చింది. గత పదేళ్లపాటు ఒక క్రమ పద్ధతిలో దాడి జరగడం వల్ల.. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఏకపక్ష దాడిలో నేను కూడా ఒక బాధితుడినే. నాపై కూడా 20 కేసులు మోపారు. నాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. నా ఇల్లు కూడా తీసుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారించారని” ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో జరిగిన చర్చలో భాగంగా రాహుల్ గాంధీ పై విధంగా స్పందించారు..

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇతర భాగస్వామ్య పార్టీలు భారీగా సీట్లు గెలుచుకున్నాయి. ముఖ్యంగా బిజెపికి కంచుకోట లాగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో భారీగా సీట్లు గెలుచుకొని బిజెపి ఆధిపత్యానికి గండి కొట్టాయి. దీంతో బిజెపి భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజలు గతం కంటే ఎక్కువ మెరుగైన సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలలో ఉత్సాహం తొణికసలాడుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీలో ఎనలేని ఆనందం కనిపిస్తోంది. దాన్ని ప్రస్ఫుటం చేసేలా రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్లో ధీటుగా ప్రసంగించారు. తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – అమిత్ షాను డిఫెన్స్ లో పడేశారు.

“ప్రతిపక్షంలో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అధికారం కంటే ఇదే ఎక్కువ విలువైంది. ఇందులో ఎక్కువ సత్యం ఉందని” రాహుల్ వ్యాఖ్యానించాడు.. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. సభ జరుగుతున్న సమయంలో కొన్ని మతపరమైన ఫోటోలను ప్రదర్శించాడు. దీనికి పార్లమెంట్ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకున్నారు. రాహుల్ వ్యాఖ్యలు సరికావని అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులను హింసావాదులను రాహుల్ గాంధీ చెప్పడం సరికాదని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ” ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకలైన వారు అహింస గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులను మార్చిన వారు రాజ్యాంగం గురించి చెబుతున్నారు. అటువంటి వారికి మాట్లాడే హక్కు లేదని” అమిత్ షా అన్నారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ మాత్రమే హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని మతాలలో ధైర్యం, నిర్భయత, సహనశీలత ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు.. ఇదే సమయంలో నీట్ పరీక్ష గురించి రాహుల్ ప్రధానంగా ప్రస్తావించారు. పేపర్ లీకేజీ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, దానిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు..”జీఎస్టీ వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఇటువంటి విషయాలపై ఎందుకు మాట్లాడరంటూ” రాహుల్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన తర్వాత రాహుల్ ప్రసంగంలో పరిపక్వత కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.