విజ్రంభిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. అయితే ఈ నిర్ణయం మరింత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. తాజాగా భారత్ లో కూడా పలురాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ జాబితాలో దేశరాజధాని ఢిల్లీతోపాటు రెండు తెలుగురాష్ట్రాలు కూడా చేరాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే ఇలా లాక్ డౌన్ చేయడం ద్వారా కరోనాను ఓడించలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) అంటోంది. డబ్ల్యూహెచ్వో అత్యున్నత ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్..
ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిజంగా కరోనాపై పోరాడాలంటే.. అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ సోకిన వారిని గుర్తించాలని ఆయన చెప్పారు. ఆ తర్వాత వారందరినీ ఐసోలేషన్ లో ఉంచాలని, వారిని ఎవరెవరు కలిసారో వారిని కూడా ఐసోలేట్ చేయాలని సూచించారు. అంతేగానీ వట్టి లాక్ డౌన్లతో వైరస్ ను ఓడించడం మాత్రం జరగదని స్పష్టంచేశారు.అంతేకాకుండా లాక్ డౌన్ మరింత ప్రమాదకరమని ఆయన వెల్లడించారు.