దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో ఇప్పటివరకు 170 జిల్లాలను హాట్ స్పాట్ ప్రాంతాలుగా, 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్ జోన్ ప్రాంతాలుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సామూహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి కరోనా వైరస్ చేరలేదని, కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చి ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్ చెప్పారు. గబ్బిలాల నుంచి అలుగు (పంగోలియన్)కు వాటి నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చని చైనా పరిశోధనలు పేర్కొంటున్నాయని తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనలోనూ దేశంలో కూడా రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్ లక్షణాలు గుర్తించామని చెప్పారు. అయితే, వాటి ద్వారా మనుషులకు సోకే అవకాశం అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే, వెయ్యేళ్లకోసారి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్ స్పాట్ కేంద్రాలు, గ్రీన్ జోన్లను గుర్తించామని లవ్ అగర్వాల్ తెలిపారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.