నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా సాంకేతిక సమస్యలతో ఆయన ఇంకా కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. వారాంతం కావడంతో శనివారం బెయిల్ మంజూరైనా ఆ పత్రాలు ఇంకా అందకపోవడంతో సోమవారం వరకు వేచి చూడాల్సి వస్తోంది. రఘురామ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్ ఇచ్చింది. కానీ విచారణ మాత్రం జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఆయనపై సీఐడీ ఆధారాలు వెతికేందుకు సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాడని, రఘురామ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. సీఐడీ అధికారుల చర్యలతో రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడానికి అంగీకరించింది. అయితే కేసు విచారణ మాత్రం కొనసాగుతోందని తేల్చింది. దీంతో రఘురామ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండిపోయింది. విచారణకు సహకరించాల్సిందేనని చెప్పింది.
సీఐడీ పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టుకు సహకరించింది. గడచిన కొన్ని నెలలుగా రఘురామ మాట్లాడిన మాటలు, వీడియోలు సేకరించింది. వీటన్నింటిని సుప్రీంకోర్టుకు సమర్పించింది. వాక్ స్వాతంత్ర్యం అంటూ రఘురామ మాట్లాడిన సాక్ష్యాలను సేకరించింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పింది. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించినా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. దీంతో రఘురామ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తానికి ఆయన బెయిల్ వ్యవహారం కూడా విచిత్రంగా మారుతోంది.
రాజ్యాంగం ముందు ఎంపీ అయినా, సగటు పౌరుడు అయినా ఒకటే. చట్టం ముందు అందరు సమానమే. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామ సీఐడీ విచారణకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఒక రోజు ముందు నోటీసులిచ్చినా లాయర్ సమక్షంలో విచారణ సాగించాలని పేర్కొంది. మరోవైపు మీడియాతో మాట్లాడకూడదని, గాయాలు చూపొద్దని సూచించింది.