మరోసారి కేసీఆర్ కేంద్రప్రభుత్వం తీరును ఎండగట్టారు. కృష్ణ జలాల వివాదాన్ని రాజేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడంతో నియోకవర్గానికి రావడం ఆలస్యమైందన్నారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామన్నారు. తొలిసారి కృష్ణ జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణ జలాల వివాదంపై దాదాగిరి చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు. తెలంగాణపై పెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు.
భవిష్యత్తులో కృష్ణా జలాలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్న కేసీఆర్.. గోదావరి నీళ్లను పాలేరు వరకు తరలిస్తామని ప్రకటించారు.కృష్ణ జలాలపై రానున్న రోజుల్లోనే ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని ప్రకటించారు.కృష్ణాపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని.. కేంద్రం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ విమర్శించారు.
ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అదనంగా హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు.