Cruise Missiles: పొరుగున ఉన్న శత్రు దేశాల వల్ల ఏటా మన దేశానికి సంబంధించిన రక్షణ రంగ వ్యయం పెరుగుతోంది. ఏటికేడు రక్షణ రంగానికి కేటాయింపులు పెంచుకుంటూ పోవడం వల్ల మిగతా రంగాల పై అనివార్యంగా కోతపడుతోంది. ఫలితంగా దేశం అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇదీ చాలదన్నట్టు విలువైన విదేశీ మారకద్రవ్యం ఆయుధాల కొనుగోలుకు వెచ్చించాల్సి వస్తున్నది. ఇదే సమయంలో మన దేశంలోనే ఆయుధాలు తయారు కావాలని ప్రభుత్వం మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా ఇప్పుడిప్పుడే ప్రయోజనాలు లభిస్తున్నాయి. రక్షణ రంగం అంటే ఆయుధాలు, మందు గుండు సామగ్రి మాత్రమే కాదు. టెక్నాలజీ మారిన తర్వాత యుద్ధ రీతి కూడా మారింది. ఇటీవల రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో మానవ రహిత యంత్రాలు ఎంత విధ్వంసం సృష్టించాయో చూసాం కదా! అందుకే రక్షణ రంగంలో అటువంటి యంత్రాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇజ్రాయిల్ లో ఈ తరహా యంత్రాలు ఎక్కువగా తయారవుతున్నాయి. కానీ వాటిని కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ప్రయోగాలు చేసి దేశంలోనే క్రూజ్ క్షిపణులు తయారు చేసే దిశగా అడుగు ముందుకు పడింది. దానికి కేంద్రం తెలంగాణ కావడం గమనార్హం.
ఇంతకీ ఏమిటి ఈ క్షిపణులు
ముందుగానే చెప్పినట్టు రక్షణ రంగంలో ఇప్పుడు యంత్రాలదే కీలక పాత్ర. అలాగని యంత్రాలు అనేక పరికరాల సమూహంతో ఏర్పాటవుతాయి. ఆ పరికరాలను తయారు చేయడమే ఇప్పుడు పెద్ద టాస్క్. అటువంటి పరికరాల్లో క్రూజ్ క్షిపణులు కీలకమైనవి. మొన్నటిదాకా వీటిని ఇజ్రాయిల్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ వంటి దేశాలు మాత్రమే తయారు చేసేవి. ప్రపంచ దేశాల అవసరాలు కూడా ఇవే తీర్చేవి. దీనివల్ల భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని చేజిక్కించుకునేవి. అయితే ఇతర దేశాల మీద ఆధారపడటం కంటే స్వదేశంలోనే క్రూజ్ క్షిపణులు తయారు చేయాలని హైదరాబాద్ కు చెందిన పనినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనేక రకాల ప్రయోగాలు చేసి చివరికి విజయవంతమైంది.
Also Read: Renuka Chowdhury- Kodali Nani: గుడివాడ బరిలో రేణుకా చౌదరి…ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్న కొడాలి నాని
క్రూజ్ క్షిపణులు, మానవ రహిత యుద్ద విమానాల్లో వినియోగించే ఇంజన్ల తయారీకి హైదరాబాదే కేంద్రం కానుంది. పనినియన్ కంపెనీ 4.5 కేఎన్ టర్బో జెట్ ఇంజన్ కు సంబంధించిన కాన్సెప్షియల్ వ్యాలిడేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన నమూనాలను రూపొందిస్తున్నది. క్రుజ్ క్షిపణుల నుంచి మానవ రహిత విమానాల వరకు వాటిల్లో ఉపయోగించే ఏరో ఇంజన్ల రూపకల్పన ప్రారంభించే యోచనలో ఉన్నామని కంపెనీ వ్యవస్థాపకుడు అడ్ల రవి అంటున్నారు. మూడు నుంచి 12 వరకు కేఎన్ శ్రేణి ఉన్న ఇంజన్లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ సంస్థ పరీక్షలకు అవసరమైన టెస్ట్ బెడ్లను కూడా సిద్ధం చేసుకుంటున్నది.
సంస్థ రూపొందించిన ఇంజన్లలో ఒక భాగాన్ని నేషనల్ ఎరోస్పేస్ లాబరేటరీలో 2000 గంటల పాటు పరీక్షించిన తర్వాత రక్షణ రంగంలో వినియోగిస్తారు. 2019లో బాలాకోట్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం పనినియన్ ఇండియా కంపెనీ ఈ ప్రాజెక్టు కోసం పని చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డి ఆర్ డి ఓ మాజీ శాస్త్రవేత్త, ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేసిన గంటాయతా గౌడ ను నియమించుకుంది. ఈయననే కాకుండా రోల్స్ రాయిస్, జనరల్ ఎలక్ట్రికల్స్ విభాగంలో పనిచేసి విశేష అనుభవం ఉన్నవారిని కంపెనీ విధుల్లోకి తీసుకుంటోంది. వీరికి నెలకు స్థాయిని బట్టి లక్షల్లో వేతనాలు చెల్లిస్తోంది. ఇవే కాకుండా పనినియన్ కంపెనీ దేశీయంగా జెట్ విమానాలు తయారు చేయాలని యోచిస్తోంది. అయితే దీనికి స్టార్టప్ కంపెనీల సహకారం ఉండాలని, లేబరేటరీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కంపెనీ వ్యవస్థాపకుడు రఘు అడ్ల అంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. కానీ ఇప్పటివరకు అక్కడ నుంచి ఎటువంటి ప్రత్యుత్తరం రాలేదు. ప్రధానమంత్రి కార్యాలయం ఇందుకు ఆమోదం తెలుపుతుందని రఘు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గనుక ఇదే కార్యరూపం దాల్చితే మనం యుద్ధ విమానాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మనమే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాం.
K.R. is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More