తీవ్రమైన రాజకీయ దుమారం రేపిన రఫెల్ యుద్ధ విమానాలు చిట్టచివరకు భారత్ భూభాగంపై అడుగుపెట్టనున్నాయి. మరో రెండు నెలలో భారత వైమానిక దళంలో చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదటగా, జూలై చివరిలోగా నాలుగు రఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్కు రానున్నట్లు తెలుస్తున్నది.
పది సంవత్సరాలకు పైగా ఈ విమానాల కోసం మన వైమానిక దళం ఎదురు చూస్తున్నది. గత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవడంలో తీవ్రజాప్యం చేయడం, ప్రస్తుత ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే ప్రతిపక్షాలు పెద్ద రాజకీయ దుమారం లేవదీయడం తెలిసిందే. అన్ని అవాంతరాలను అధిగమించి 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో రూ 60 వేల కోట్ల డీల్ను భారత్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. .
వాస్తవానికి మే చివరిలోగా యుద్ధవిమానాలు రావలసి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అంబాలా ఎయిర్ బేస్ కు రానున్న విమానాలలో మూడు రెండు సీట్ల విమానాలు, ఒకటి సింగిల్ సీటర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రఫేల్ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆర్కే బదౌరియాకు సముచిత గౌరవం ఇవ్వడం కోసం విమానాల టెయిల్ నెంబర్లకు ఆర్కే సిరీస్ ఇవ్వనున్నారు. 17 గోల్డెన్ ఆర్సో స్క్వాడ్రన్ పైలట్ తొలి విమానాన్ని భారత్కు తీసుకురానున్నారు.
మార్గమధ్యంలో మిడిల్ఈస్ట్లో ఉన్న ఫ్రెంచ్ ట్యాంకర్లో ఇంధన నింపనున్నారు. వాస్తవానికి సింగిల్ జర్నీలో ఇండియాకు రావొచ్చు, కానీ చిన్న కాక్పిట్లో సుమారు 10 గంటల పాటు కూర్చోవడం సరికాదు అని అధికారులు పేర్కొన్నారు. రఫేల్ విమానాలను నడిపే భారతీయ పైలట్లు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు.