వృద్ధులు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులు పోలీసులకు చిక్కడంతో సంచలనం కలిగించిన వృద్ధ దంపతుల కేసులో చిక్కుముడి వీడింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ పెనమలూరులో ఏటీఎంలో చోరీచేసి పట్టుబడిన ముగ్గురు నిందితుల వేలి ముద్రల ఆధారంగా కంచికచర్లలో వృద్ధ దంపతులను ఈ ముఠా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
డిసెంబర్ 25న బండారుపల్లి నాగేశ్వర్ రావు అలియాస్ నాగులు, భార్య ప్రమీల రాణి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసేందుకు వచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇంటి వెనుకక ఉన్నప్రధాన ద్వారం తెరిచి దొంగలు లోపలికి ప్రవేశించారని పోలీసులు గుర్తించారు.
వృద్ద దంపతుల హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంగానే పెనమలూరులో ఒక ఏటీఎం చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వేలిముద్రల ఆధారంగా కంచికచర్లలో జంటహత్యలకు పాల్పడింది. ఈ ముఠాయేనని పోలీసులు తేల్చారు. దొంగతనాలతో పాటు పలు హత్యల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు సమాచారం
యూట్యూబ్ లో నేర కథనాలు చూసి యువకులు పథకాలు రచిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఒంటరి మహిళలు, ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులను టార్గెట్ చేసి సహజ మరణం పొందినట్లు ఎవరికి అనుమానం రాకుండా హత్యలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠా పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పెనమలూరు పోలీసులు గుర్తించారు.