కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 100 రూపాయలు దాటగా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో సెంచరీకి చేరువలో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు పెట్రోల్ ధరల మంట మీద కేంద్రం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఇంధన ధరలపై ట్యాక్స్ తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: నేనే కనుక సీఎం అయితే.. పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో వైసీపీలో అలజడి
ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్లలో ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్కు చేరాయి. పెరిగిన ధరలు సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు ఇదో అస్త్రంగా మారింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ను తాత్కాలికంగానైనా తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్, డీజిల్ పైనే చాలా వరకు ఆదాయం సమకూరుతుంటుంది. కేంద్రం విధిస్తున్న సుంకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ కలుపుకుని మొత్తంగా 5.5 లక్షల కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ కిందకు తీసుకొస్తే సుమారు 2.5 లక్షల కోట్ల ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది. అందుకే.. కేంద్రం అందుకు సిద్ధంగా లేదు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే సిఫార్సులేవీ జీఎస్టీ కౌన్సిల్ చేయలేదని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పష్టం చేశారు.
Also Read: బీజేపీ వ్యూహంలో జనసేనాని.. స్టీల్ ఉద్యమంలో పాల్గొనంది అందుకేనా..!
ఇదిలా ఉండగా.. కొద్ది నెలలుగా పైపైకి ఎగబాకుతున్న ఇంధన ధరలు గడిచిన 9 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే తాత్కాలికంగా ధరల పెరుగుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఎన్నికలకు ముందు దాదాపు 55 నెలల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరుకున్నాయి. అయితే ఎన్నికలు దగ్గరపడ్డ తర్వాత వరుసగా 19 రోజుల పాటు ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆ తర్వాత ఓటింగ్ ముగిసిన రెండు రోజులకే మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే.. ప్రభుత్వ ప్రమేయంతోనే ఇలా ధరల నియంత్రణ జరిగిందన్న ప్రచారాన్ని చమురు కంపెనీలు ఖండించాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్