Tirumala : తిరుమలకు భక్తులు రావొద్దు.. టిటిడి సూచన.. కారణం అదే

ఈ అంతరాయాన్ని భక్తులు గమనించాలని.. వీలైనంతవరకు రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల రావద్దని పరోక్షంగా టిటిడి సూచించింది. కానీ ఇప్పటికే ప్రయాణ ఏర్పాటు చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకోవడం విశేషం.

Written By: Dharma, Updated On : January 29, 2024 10:34 am
Follow us on

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలిరావడం కనిపిస్తోంది. దీంతో టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో ఆంక్షలు విధించింది. ఏకంగా నాలుగు వేల టోకెన్లను రద్దు చేసింది. నడక మార్గంలో వచ్చే వారి విషయంలో టోకెన్ల కుదింపు విధించింది. శని, ఆదివారాల్లో ఈ టోకెన్ల రద్దు కొనసాగింది.

ప్రస్తుతం తిరుమలకు మెట్ల మార్గం, రోడ్డు మార్గం గుండా భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తుల రాక అధికంగా ఉంది. దీంతో తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం రావడం, మధ్యలో శనివారం వీకెండ్ కావడం, ఆదివారం సెలవు కలిసి రావడంతో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఎటు చూసినా గోవిందా గోవిందా అంటూ నామస్మరణ కనిపిస్తోంది. అటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని తొమ్మిది షెడ్లు భక్తులతో నిండి.. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ వ్యాపించింది. సోమవారం సాయంత్రం వరకు ఈ రద్దీ ఉంటుందని టిటిడి భావిస్తోంది.

శ్రీవారి దర్శనం 24 గంటల నుంచి 30 గంటల వరకు పడుతోంది. దీంతో భక్తులు క్యూ లైన్ లలో గంటల తరబడి వేచి ఉండడం కనిపిస్తోంది. ఈ తరుణంలో భక్తులకు టిటిడి ప్రత్యేక వస్తువులు కల్పిస్తోంది. అన్న ప్రసాదం, పాలు, మజ్జిగ, సుండల్ అందిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై టీటీడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు నడక మార్గంలో దాదాపు నాలుగు వేల టోకెన్లు టిటిడి రద్దు చేసింది. సోమవారం సైతం టోకెన్లు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ అంతరాయాన్ని భక్తులు గమనించాలని.. వీలైనంతవరకు రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల రావద్దని పరోక్షంగా టిటిడి సూచించింది. కానీ ఇప్పటికే ప్రయాణ ఏర్పాటు చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకోవడం విశేషం.