‘ఇది ఢిల్లీ వాసుల విన్నపం’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోడీ కి ఒక ప్రత్యేకమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన అనేక అంశాలను పొందుపరిచారు. మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్లు తెరవాలని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్లు కోరుకుంటున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. బేసి-సరి పద్ధతిలో రోజు మార్చి రోజు సగం దుకాణాలు తెరవాలని సూచించారని చెప్పారు. రెడ్ జోన్లు లేని చోట హోటళ్లు మూసివేసి హోం డెలివరీ చేసేలా రెస్టారెంట్లు తెరవాలని చాలామంది సూచించారని కేజ్రీవాల్ చెప్పారు. బార్బర్ షాపులు, స్పాలు, సెలూన్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, తెరవొద్దనే విషయంలో ఏకాభిప్రాయం ఉందన్నారు. వేసవి సెలవులు అయిపోయేవరకూ పాఠశాలలు, విద్యాసంస్థలు మూసి ఉంచాలని చాలామంది సూచించారని కేజ్రీవాల్ చెప్పారు. లాక్డౌన్ కొనసాగించాలని ఎక్కువ మంది ఢిల్లీ వాసులు కోరుకుంటున్నారని సీఎం తెలిపారు. 5 లక్షల మంది ఢిల్లీ వాసులు తమకు సూచనలు అందించారని చెప్పిన ఆయన ఈ వివరాలను ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ ద్వారా కేంద్రానికి అందిస్తామన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్3.0 కొనసాగుతోంది. ఈ నెల 17 వరకూ ఇది అమల్లో ఉంటుంది. అనేక రాష్ట్రాలు ఇప్పటికే నెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగించాయి. ఈ తరుణంలో కేంద్రం లాక్ డౌన్ పై తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.