Deaths In Jangareddygudem: సీఎం జగన్ కొన్నిసార్లు అనాలోచితంగా చేసే కామెంట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. చాలాసార్లు జాగ్రత్తగానే స్పందించే జగన్.. సున్నితమైన అంశాల విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. గత రెండు రోజులుగా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ మరణాలపై టీడీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టింది. దీంతో అయిష్టంగానే స్పందించిన జగన్.. జంగారెడ్డిగూడెంలో రెండు రోజులుగా 18 మంది మరణాలు సహజ మరణాలే అంటూ తేల్చి చెప్పేశారు. దేశంలో ఏటా సహజ మరణాలు రెండు శాతం నమోదు అవుతున్నాయని.. 50 వేల మంది ఉన్న జంగారెడ్డిగూడెం లో 18 మంది చనిపోవడం సహజమే అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడే జగన్ పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. జంగారెడ్డి గూడెంలో కల్తీ నాటుసారా ఏరులై పారుతుందని ఆ కారణంగానే ఇంత మంది చనిపోతున్నారని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. పైగా చనిపోయిన 18 మందిలో 16 మందిని ఇప్పటికే కుటుంబీకులు దహనం చేశారు. ఇద్దరిని మాత్రమే ఖననం చేయడంతో వారికి పోస్టుమార్టం చేస్తున్నారు అధికారులు. వీరి మరణానికి గల కారణాలు అధికారులు, డాక్టర్లు ఇంకా వెల్లడించలేదు.
Also Read: Janasena Pawan: ‘జనసేనాని’ గేర్ మార్చాల్సిందేనా?
మరి డాక్టర్లే చెప్పకుండా జగన్ కు అవి సహజ మరణాలే అని ఎలా తెలిసిందనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. పోనీ పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత ఇలాంటి కామెంట్స్ చేసినా.. కాస్తంత గౌరవంగా ఉండేదేమో. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనట్లు జగన్ సమాధానాలు చెప్పడం సర్వత్రా సంచలనం రేపుతుంది.
పైగా చర్చకు పట్టుబట్టిన టీడీపీ నేతలను బడ్జెట్ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేయడం జగన్ నియంతృత్వాన్ని చూపిస్తోందని అంటున్నారు టీడీపీ నేతలు. సీరియస్ విషయంపై మాట్లాడాలని కోరితే జగన్ ఎందుకు కోపగించుకుంటున్నారని అంటున్నారు ప్రతిపక్షాల నేతలు.
ఇక జంగారెడ్డిగూడెంలో నాటుసారా అమ్ముతోంది వైసీపీ నేతలే అంటూ అక్కడి స్థానికులు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఒక సీఎం అయి ఉండి కనీసం విచారణ రిపోర్టులు లేకుండా ఎలా మాట్లాడుతారని అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి అనాలోచితంగా జగన్ మరోసారి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయి.