TSPSC Paper Leak: టీఎస్‌ పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ: అంగడి సరుకులా ప్రశ్నపత్రాల విక్రయం?

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌తో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్‌, తమ్ముడు రాజేశ్వర్‌లు భారీ స్థాయిలోనే పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల కుంభకోణానికి పాల్పడ్డారు రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకొని ఏఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసిన నిందితులు.. వాటిని అంగట్లో సరుకులా అడ్డగోలుగా విక్రయించారు. వీటి విక్రయంలో ఢాక్యానాయక్‌, అతని బావమరిది కేతావత్‌ రాజేశ్వర్‌ కీలక పాత్ర పోషించారు. నీలేశ్‌నాయక్‌, గోపాల్‌ నాయక్‌కు రూ.14.50 లక్షలకు ఏఈ […]

Written By: Bhaskar, Updated On : March 26, 2023 8:20 pm
Follow us on

TSPSC Paper Leak

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌తో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్‌, తమ్ముడు రాజేశ్వర్‌లు భారీ స్థాయిలోనే పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల కుంభకోణానికి పాల్పడ్డారు రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకొని ఏఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసిన నిందితులు.. వాటిని అంగట్లో సరుకులా అడ్డగోలుగా విక్రయించారు. వీటి విక్రయంలో ఢాక్యానాయక్‌, అతని బావమరిది కేతావత్‌ రాజేశ్వర్‌ కీలక పాత్ర పోషించారు. నీలేశ్‌నాయక్‌, గోపాల్‌ నాయక్‌కు రూ.14.50 లక్షలకు ఏఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి.. తాజాగా నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్‌రెడ్డికి, అతని ద్వారా మరో ముగ్గురికి రూ.7.50 లక్షలకు విక్రయించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు బయట పడుతుండడంతో పదుల సంఖ్యలో ఏఈ పేపర్‌ చేతులు మారాయి.

12 మంది కటకటాల్లోకి..

టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే 12 మందిని కటకటాల్లోకి పంపిన సిట్‌ అధికారులు తాజాగా మరో నలుగురు అక్రమార్కులను గుర్తించినట్లు తెలిసింది. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన వారి నుంచి ఈ నలుగురు ఆ పేపర్‌ను పొందినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకం విభాగంలో ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌.. లీకైన ప్రశ్నపత్రాన్ని సంపాదించి ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష రాశాడు. ఈ మేరకు నవాబ్‌పేటలో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న సిట్‌ అధికారులు శనివారం అర్ధరాత్రి వరకూ అతణ్ని విచారించారు.

మరో యువకుడు కూడా..

ఈ క్రమంలో ప్రశాంత్‌ నుంచి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు ప్రశ్నపత్రాన్ని పొంది ఏఈ పరీక్ష రాసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో అతణ్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. షాద్‌నగర్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా ఏఈ పరీక్ష రాసినట్లు గుర్తించారు. వెంటనే వారిని సైతం అదుపులోకి తీసుకొని.. మొత్తం నలుగురిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. నేడో రేపో వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్‌డేటా ఆధారంగా ప్రశాంత్‌ పేరు..

ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన నిందితులైన రేణుక, ఢాక్యానాయక్‌, ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించిన సిట్‌ అధికారులు.. మరోవైపు వారి కాల్‌డేటాపైనా దృష్టి సారించారు. కాల్‌డేటా ఆధారంగా ఏఈ పరీక్ష సమయంలో రేణుక, ఢాక్యానాయక్‌తో టచ్‌లో ఉండి, పరీక్ష రాసిన వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్‌ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. విచారణలో ఢాక్యానాయక్‌, ప్రశాంత్‌ ఇద్దరూ ఒకే డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్నట్లు తేలింది. ఢాక్యానాయక్‌ డీఆర్‌డీఏ వికారాబాద్‌ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్‌.. నవాబ్‌పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో ఈసీ (ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌)గా పనిచేస్తున్నాడు.

TSPSC Paper Leak

ప్రధాన నిందితులకు కస్టడీ..

పేపర్‌ లీకేజీలో ప్రదాన పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్న నలుగురు ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, ఽఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌ను మరోసారి పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మరో 3 రోజులు కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే వారిని మొదటి విడత 6 రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు.

సోమవారానికి వాయిదా

గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని పొంది ఎగ్జామ్‌లో అధిక మార్కులు సంపాదించినట్లు తేలిన ఇద్దరు టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌ను, మాజీ ఉద్యోగి సురే్‌షను సిట్‌ అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. వారిని లోతుగా విచారించి మరింత సమాచారం రాబట్టడానికి వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.