ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై కరోనా ప్రభావం పడింది. దేశంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 15కి వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
కోవిడ్-19 నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ను నిర్వహించలేమంటూ ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ సృష్టిస్తున్న అలజడి కారణంగా పలు దేశాలు అనేక క్రీడా సంబరాలను రద్దు చేశాయి. ఆ కోవలోనే ఐపీఎల్ను కూడా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనా వ్యాప్తి పట్ల బీసీసీఐ ఆందోళన చెందుతున్నదని, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మంత్రిత్వశాఖతో పాటు ఇతర శాఖలతోనూ కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఆటలను కొనసాగించాలని బీసీసీఐ పట్టుదవులాగా ఉన్నప్పటికీ కేంద్రం సూచనలతో పాటు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ను వాయిదా వేయాలంటూ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాదానికి లేఖలు రాయడం, కోర్టులో పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే విదేశీయులకు వీసాలు నిలిపివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో .. పలు దేశాల క్రికెటర్లు భారత్ కు రావడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో పాటు స్టేడియాలలో ప్రజలు భారీ సంఖ్యలో గుమికూడదనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతూ ఉండడంతో … వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ను వాయిదా వేయక తప్పలేదు
కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, లా లీగా, సేరీ ఏ, ఎన్బీఐ, ఏటీపీ టూర్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ను కూడా రద్దు చేశారు.