దేశంలో కొన్ని ప్రాంతాలలో తీవ్రతరంగా ఉన్నప్పటికీ మొత్తం మీద కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కరోనా కేసులు సగటున 9.1 రోజులకు రెట్టింపు అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొత్త కేసుల వృద్ధిరేటు 6 శాతంగా మాత్రమే ఉన్నది.
దేశాన్ని కరోనా వైరస్ కుదిపివేస్తున్న గత 100 రోజులలో ఇది చాలా తక్కువ రోజువారీ వృద్ధిరేటు కావడం గమనార్హం. ఇదే సమయంలో దేశంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంలో సహితం ముందడుగు వేస్తున్నారు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో అత్యున్నత మంత్రివర్గ కమిటీ (జీవోఎం) గత రాత్రి సమావేశమై రాష్ట్రాలవారీగా కరోనా దవాఖానలు, ఐసొలేషన్ బెడ్లు, వార్డులు, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇతర సదుపాయాలపై సమీక్ష జరిపారు.
దేశీయ తయారీ సంస్థలు ఇప్పటికీ పీపీఈ కిట్లు, మాస్క్లను తయారు చేయడం ప్రారంభించాయి. దానితో అవి సరిపడినంతగా అందుబాటులో ఉన్నట్లు మంత్రుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
‘ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షకుపైగా పీపీఈ కిట్లు, మాస్క్లు తయారవుతున్నాయి. 104 సంస్థలు పీపీఈ కిట్లను, మూడు సంస్థలు ఎన్95 మాస్క్లను తయారుచేస్తున్నాయి. దేశీయ సంస్థలు ఇప్పటికే వెంటిలేటర్ల తయారీని ప్రారంభించాయి. 59,000 యూనిట్ల తయారీకి ఆరు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాం’ అని కేంద్ర వైద్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 3.1 శాతం ఉండగా, రికవరీ రేటు 20 శాతానికిపైగా ఉన్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. లాక్డౌన్తోపాటు క్లస్టర్ మేనేజ్మెంట్, కంటైన్మెంట్ స్ట్రాటజీ వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,194కు చేరుకోగా, మృతుల సంఖ్య 824కు పెరిగింది.