అది పొరపాటా..? ఎన్నికల జిమ్మిక్కా..?

చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిన్న కేంద్రం ప్రకటించింది. తదుపరి వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇక ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. కొన్ని కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపే ఆదేశాలపై పొరపాటు ఎలా జరిగిందని ప్రశ్నించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇక ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడింది. పీపీఎఫ్‌, నేషనల్‌ […]

Written By: Srinivas, Updated On : April 1, 2021 1:50 pm
Follow us on


చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిన్న కేంద్రం ప్రకటించింది. తదుపరి వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇక ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. కొన్ని కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపే ఆదేశాలపై పొరపాటు ఎలా జరిగిందని ప్రశ్నించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇక ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడింది.

పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గురువారం ఉదయానికే ఆ ఉత్తర్వులను మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయి. పొరబాటుగా ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నాం’ అని ఆర్థిక మంత్రి ఈ ఉదయం ట్వీట్‌ చేశారు.

ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. ‘వడ్డీరేట్లను తగ్గించే ఉత్తర్వులను జారీ చేయడంలో నిర్మలా సీతారమన్‌ నిజంగానే తొలుత పొరబడి ఆ తర్వాత దిద్దుబాటు చర్యగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా..? లేదా దీని వెనుక ఎన్నికల ‘దూరదృష్టి’ ఏదైనా ఉందా’ అని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిలదీశారు.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ‘మేడం ఆర్థిక మంత్రి.. మీరు సర్కస్‌ నడుపుతున్నారా..? లేదా సర్కారా..? కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అలాంటి ఆదేశాల్లో పొరబాటు ఎలా జరుగుతుంది..? దీనికి బాధ్యత ఎవరిది..? మీకు ఆర్థిక మంత్రిగా కొనసాగే హక్కు లేదు’ అని సుర్జేవాలా ట్విట్టర్‌‌లో మండిపడ్డారు. మొత్తంగా కేంద్రం తొందరపాటు నిర్ణయం కాస్త ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి అందివచ్చిన అవకాశంలా మారింది.