Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో అదుపు గాని వైరస్... కేంద్రం సీరియస్

ఏపీలో అదుపు గాని వైరస్… కేంద్రం సీరియస్


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ అదుపు కాకపోవడం, రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఈ విషయమై ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వశాఖల బృందాలను ఏపీకి కూడా పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షించేందుకు నియమించిన ఐఎంసీటీ బృందాలు ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో పర్యటించడం తెలిసిందే. ‌ ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా సీఆర్‌పీఎ్‌ఫను రంగంలోకి దించే అవకాశం కూడా ఉంటుంది.

రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదంటూ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి స్వయంగా తెలపడం గమనార్హం. అయితే క్షేత్రస్థాయి పరిష్టితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు గమనిస్తున్నారు.

గురువారం ఒక్కరోజే 80 కొత్త కేసులు నమోదవడంతో మరింత ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో మార్చి 12న తొలి కేసు గుర్తించిన తర్వాత ఒకేరోజు ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఏప్రిల్‌ 20వ తేదీన 75 కేసులే ఇప్పటి వరకూ అత్యధికం. పైగా, తొలి నుండి కరోనా అధికంగా ఉన్న పొరుగున ఉన్న తెలంగాణలో సహితం ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు.

గత నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 246 కేసులు వెలుగుచూశాయి.తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 893కి పెరిగిపోయింది. అంటే 900 సంఖ్యకు చెరువులోకి వచ్చింది. కర్నూలులో కొన్ని మానవ తప్పిదాలపై ఆరోపణలు రావడం గమనార్హం.

మరోవంక ప్రభుత్వం చెబుతున్న అంకెల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని బులెటిన్లలో అంకెల వ్యత్యాసం స్పష్టమవుతున్నది. కరోనా మరణాలను, కేసులను తక్కువగా చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీకి, టిడిపి నేతలు వరుసగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు పంపుతున్నారు.

స్థానిక పరిస్థితుల నేపథ్యంలో చాలాచోట్ల పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, లాక్‌డౌన్‌ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయక పోవడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. స్వయంగా వైసిపి ఎమ్యెల్యేలు, ఎంపీలు నిబంధనలకు తిలోదకాలిచ్చి, సాంఘిక దూరం పాటించకుండా బహిరంగంగా, గుంపులుగా తిరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

మరోవంక, కర్నూలు జిల్లా నుంచి పొరుగున ఉన్న తమ ప్రాంతాలకు వైపతి చెందుతున్నట్లు తెలంగాణ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్‌ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. దానితో 25 రోజుల క్రితమే కర్నూల్ తో తెలంగాణ ప్రభుత్వం సరిహద్దును మూసివేసింది.

కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్‌ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్‌ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version