High Temperatures: మండుతున్న భారతం.. దేశంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు

High Temperatures: ఇక దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు రెండు రోజుల క్రితం ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీలుగా నమోదైంది. అయితే దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.

Written By: NARESH, Updated On : May 31, 2024 8:05 pm

High Temperatures

Follow us on

High Temperatures: దేశ ఎండలతో మండుతోంది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఆ ఉష్ణోగ్రతను దాటి ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగ్ పూర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏర్పాటుచేసింది. ఇందులో రెండింటిలో గురువారం(మే 30న) అసాధారణ ఉష్ణోగ్రతలు చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు రికార్డయ్యాయి.
ఢిల్లీ చరిత్రలో తొలిసారి..
ఇక దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు రెండు రోజుల క్రితం ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీలుగా నమోదైంది. అయితే దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ పరిణామాల వేళ ఇప్పుడు నాగ్‌పూర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం మరోసారి చర్చనీయాంశమైంది. ఇక్కడా సెన్సార్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వడదెబ్బకు 54 మంది మృతి
మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా బిహార్‌లో 32 మంది మృతిచెందగా, ఓడిశాలో 10 మంది, జార్ఖండ్‌, రాజస్థాన్‌లో ఐదుగురు చొప్పున, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీలో ఒక్కొక్కరు మరణించారు. రానున‍్న రెండు రోజుల్లో యూపీ, ఢిలీ‍్ల, చండీగఢ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో దుమ్మతో తుఫాన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. వడగాలులు తీవ్రంగా ఉన్నందున దేశంలో జాతీయ ఎమర్జెన్సీ  విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
రుతుపవనాలపై ఆశ..
ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం కాస్త ఊరట కలిగించే అంశం.గురువారం కేరళ తీరాన్ని తాకిన ఈ రుతుపవనాలు.. ప్రస్తుతం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. దీంతో శనివారం నుంచి వడగాలుల తీవ్రత కాస్త తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.