బెంగాల్ ను విడగొట్టాలని బీజేపీ మొదటి నుంచి భావిస్తోంది. విభజన ఉద్యమాలకు మద్దతు ఇస్తూ వారిలో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నారు. బెంగాల్ లో డార్జిలింగ్, దాని పరిసర ప్రాంతాలను గోర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉండడంతో ఇప్పుడు బీజేపీ దానికి వంత పాడటంతో ఉద్యమం తీవ్ర స్థాయిలో రగిలే అవకాశముంది. బెంగాల్ ను మూడు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే సువేందు అధికారి నైరుతి ప్రాంతం ప్రజలంతా విడిపయేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం తెలిసిందే. దీనికి బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) మద్దతు ప్రకటించారు.
ఉత్తర బెంగాల్ భగీరథీ-హుగ్లీక ఉత్తరాన ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. నైరుతి ప్రాంతం ఐదు జిల్లాలతో కలిసి ఉంది. ఈ రెండు ప్రాంతాలను కలిపితే 42 లోక్ సభ స్థానాలకు గాను 16 స్థానాలున్నాయి. ఇక్కడ 109 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న 77 స్థానాల్లో 53 సీట్లు ఈ ప్రాంతంలోనివే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నైరుతి, ఉత్తర బెంగాల్ రెండు స్టేట్లుగా విభజించాలనే డిమాండ్ రావడం తెలిసిందే.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం బెంగాల్ నే మూడు ముక్కలు చేయాలని చూడడం దారుణమే. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పార్టీకి బలం చేకూరుతుందనే నెపంతో విభజన మంత్రం పాటించడం సముచితం కాదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలపై అన్ని పార్టీలు కూడా ఓ కన్నేశాయి. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉద్దేశంతో బెంగాల్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.