Bihar: దేశంలో అవినీతి పాలన, అరాచకాలకు అడ్డాగా చాలా మంది బీహార్ను చూపుతారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అక్కడి పాలకులు, ధన వంతులు, దుండగులు చేసే పనులే ఇందుకు కారణం. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా బీహార్లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో నేరాలు అదుపులోకి వస్తున్నాయి. ప్రశ్నించేతత్వం పెరుగడంతో పాలకుల్లోనూ మార్పు వస్తోంది. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీశ్కుమార్ వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమువుతందని ఆసల్యంగా గుర్తించారు. ఈ క్రమంలో ఇటీవలే బిహార్లో 1.78 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. తాజాగా విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ధరించే బట్టలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని విద్యాశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. సమాజంలో దైవంతో సమానంగా భావించబడేది గురువులు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అందరికి ఆదర్శవంతంగా ఉండాలని, ఉత్తమ గుణాలు కలిగి, మంచి ప్రవర్తనతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలని, విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
వేషధారణను బట్టి నడవడిక..
ఒక వ్యక్తి యొక్క వేషధారణను బట్టి అతడి నడవడికను అంచనావేయవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులు ధరించి విధులు నిర్వహిస్తేనే వారు హూందాగా కనిపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీహార్ విద్యాశాఖ ఆఫీసుల్లో జీన్స్, టీ–షర్టులు ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, అధికారులందరికీ డ్రెస్కోడ్ను అమలు చేయాలని నిర్ణయించింది. గౌరవ మర్యాదలు కాపాడుకోవడం, కార్యాలయ నియమాలకు కట్టుబడి ఉండే ప్రాముఖ్యతను తెలిపుతూ విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు..
తాజా ఉత్తర్వులపై బీహార్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విద్యాశాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొంతమంది తప్పు పడుతున్నారు. బట్టలు మార్చడం ద్వారా వ్యస్థ బాగుపడదని, వ్యవస్థలో సంస్కరణలు చేయాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడాలని సూచిస్తున్నారు. మరికొందరు విద్యాశాఖ సంస్కరణల్లో వేషధారణ కూడా ఒక భాగమని, పిల్లలు గౌరవించేలా గురువులు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని పేర్కొంటున్నారు. సైకాలజీ ప్రకారం.. విద్యార్థులు, గురువులను అనుకరిస్తారు. కట్టు బొట్టు, బోధన, మాటతీరు అన్నీ విద్యార్థులను ప్రభావితం చేస్తాయి. అందుకే విద్యాశాఖ తాజాగా వస్త్రధారణలో మార్పులు చేసిందని చైల్డ్ సైకాలజిస్టులు భావిస్తున్నారు.