Homeజాతీయ వార్తలుBJP : బీజేపీ గెలిస్తే.. బీసీ ముఖ్యమంత్రి.. అమిత్ షా సంచలన ప్రకటన.. రేసులో ఎవరంటే?

BJP : బీజేపీ గెలిస్తే.. బీసీ ముఖ్యమంత్రి.. అమిత్ షా సంచలన ప్రకటన.. రేసులో ఎవరంటే?

– వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమన్న అమిత్ షా
– సూర్యాపేట బహిరంగ సభలో బీజేపీ బిగ్ అనౌన్స్‌మెంట్
– ఇచ్చిన హామీలను పూర్తిచేసే చరిత్ర కలిగిన ఏకైన పార్టీ బీజేపీ
– ఇన్నాళ్లుగా బీసీలను ఓటుబ్యాంకుగానే చూస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు
– దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోచేతికి బెల్లం పెట్టిన వ్యక్తి కేసీఆర్
– బీసీలను విడదీస్తూ.. హిందూ సమాజం ఓట్లను చీలుస్తున్న కాంగ్రెస్
– అమిత్ షా ప్రకటనతో బీజేపీలో కొత్త జోష్..తెలంగాణలో హీటెక్కిన రాజకీయం
– ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో జనరల్ స్థానాల్లో 52 శాతం సీట్లు బీసీలకు కేటాయించిన బీజేపీ

BJP :  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా వెల్లడిచారు. దీంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇన్నాళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన సూర్యాపేటలో జరిగిన బీజేపీ బహిరంగ సభ వేదిక ద్వారా స్పష్టం చేశారు.

వరుస చేరికలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జోరుమీదున్న బీజేపీలో.. సూర్యాపేటలో అమిత్ షా ప్రకటనతో మరింత హుషారు పెరిగింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం.. తెలంగాణలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న పార్టీలన్నింటికీ చెంపపెట్టుగా మారింది.

ఇప్పటికే విడుదల చేసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో.. బీసీలకు సముచిత ప్రాధాన్యతను కల్పించిన భారతీయ జనతా పార్టీ.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సమాజానికి సరైన గౌరవాన్ని, గుర్తింపును కల్పించినట్లయింది.

సాధారణంగా బీజేపీ పార్టీ తన చరిత్రలో ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ముందుగా ఇలా ప్రకటించిన దాఖలాల్లేవు. కానీ.. ఈసారి బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం.. ఇతర పార్టీలో గుబులు రేపుతోంది. ఇంతవరకు ఇచ్చిన ఏ హామీని కూడా విస్మరించని చరిత్ర బీజేపీది. ఈ నేపథ్యంలో బీసీలకు ఎక్కువ సీట్లు కల్పించడం, బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని స్పష్టం చేయడం ద్వారా.. తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఈ సామాజిక వర్గానికి రాజకీయంగా సరైన ప్రాధాన్యత లభించనుంది.

అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత తానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని తెలంగాణలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను నిట్టనిలువునా మోసం చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంది. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే బీజేపీ.. అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిని చేయడం ఖాయం.

అటు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకోసం ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదు. తాజాగా.. చేసిన ఓ ప్రకటనలోనూ.. తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని ఉత్తుత్తి హామీని ఇచ్చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఈ హామీని ఇవ్వడానికి కారణం ఒక్కటే. హిందూ ఓటర్లను కులాల లెక్కన విడదీసి.. మరోసారి బీసీల ఓటు బ్యాంకును వాడుకుని.. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ వెనుకబడిన వర్గాలను గాలికి వదిలేయడమే వారి అలవాటు. అధికారంలో ఉన్నన్ని రోజులూ.. భారత సమాజాన్ని విడదీసి చూస్తూ.. కలహాలు పెడుతూ సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది.

మరోవైపు, నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని బీజేపీ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీసీల సంక్షేమానికి వివిధ పథకాలను తీసుకురావడంతోపాటుగా వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ.. ఆయా వర్గాల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బీసీల సంపూర్ణ సాధికారతకోసం పనిచేస్తోంది. సమాజాన్ని ఏకీకృతం చేయడం బీజేపీ సిద్ధాంతమైతే.. ‘డివైడ్ అండ్ రూల్’ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ క్రూరమైన ఆలోచన. సూర్యాపేట బహిరంగ సభ వేదిక ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వాగ్దానాలలోని అనైతికతను, మోసాన్ని దేశప్రజలందరికీ ఎత్తిచూపేందుకు ఉద్దేశించిన ఓ వ్యూహం.

జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యతను కల్పించాలనేది బీజేపీ అంకిత భావానికి నిదర్శనం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ప్రజలందరి ముందున్నాయి. మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఒక మచ్చుతునక. 27 బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీలు మోదీ కేబినెట్లో ఉన్నారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ.. ఇంతపెద్దస్థాయిలో బీసీలకు, దళితులకు కేంద్ర మంత్రిత్వ శాఖలో స్థానం లభించలేదు.

22 అక్టోబర్ నాడు, బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన 52 ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితాలోనూ.. 38 జనరల్ కేటగిరీ స్థానాల్లో 20 మంది బీసీలను బరిలోకి దించింది. అంటే తొలిజాబితాలోని 52 సీట్లలో.. 52శాతం బీసీలకే కేటాయించింది. మిగిలిన వాటిలో 14 సీట్లను (నియోజకవర్గాల పునర్విభజన నిబంధనల ఆధారంగా) దళితులకు, గిరిజనులకు కేటాయించింది.

ప్రకటనలు చేయడం మాత్రమే కాదు, వాటిని అమల్లో చేసిచూపించే ఏకైక పార్టీ బీజేపీయే. రాజకీయ, ఆర్థిక పురోగతి, సాధికారత, రాజ్యాధికారం వంటి అంశాల్లో బీసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు సరైన గౌరవం దక్కేది.. బీజేపీ పాలనలోనే అనే అభిప్రాయం బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇక బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడంతో రేసులో బండి సంజయ్ తోపాటు ఈటల రాజేందర్ లు ప్రధాన పోటీదారులుగా ఉంటారు. అయితే బీజేపీ గెలిస్తేనే ఈ సీఎం కుర్చీ.. కానీ అంత బలం లేకపోవడంతో ఈ ప్రకటన కేవలం బీజేపీ నేతలకు ఊరటగానే చెప్పొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version