దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడి, బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొందని వెల్లడించింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
అల్పపీడన ప్రభావం రాయలసీమలో శుక్రవారమే కనిపించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ నాలుగు రోజులపాటు రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కోస్తాలో రబీ పంట కోతలను ప్రారంభించాలనుకుంటున్న రైతులు ఈ నాలుగు రోజులు ఆగితే మంచిదని సూచిస్తున్నారు.