Site icon OkTelugu

పవన్‌ వ్యాఖ్యలపై సంజయ్‌ ఫైర్‌‌

Bandi Sanjay Pawan Kalyan
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ జన సైనికులతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ నేతల వ్యవహారాన్ని ఎండగట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు.. తమను మిత్రపక్షంగా గుర్తిస్తున్నప్పటికీ రాష్ట్రానికొచ్చేసరికి పరిస్థితులు తలకిందులవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ నేతలెవరూ తమను గుర్తించట్లేదని అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే.. బీజేపీ అభ్యర్థికి బదులుగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సురభి వాణీదేవికి ఓటు వేయాలని సూచించినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Also Read: బీజేపీపై పొత్తు ఉండాలా..? వద్దా..?

అంతేకాదు.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు నిర్వహించబోయే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలతో ఎలాంటి పొత్తు గానీ, వారికి అండగా నిలిచేది లేదని ఉండబోదని తేల్చేశారు. తమను గౌరవించని వారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ జనసేన పార్టీ శ్రేణుల గౌరవం తనకు ముఖ్యమని, అది దక్కనప్పుడు వారితో కలవాల్సిన పనిలేదన్నారు. అందుకే.. ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికల్లో సురభి వాణీదేవి గెలవాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమ పట్ల తెలంగాణ బీజేపీ సరిగా వ్యవహరించలేదని జనసేన అధినే పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీని తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే వాడుకుని వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే మద్దతు ప్రకటించామని గుర్తు చేసిన పవన్.. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను కనీసం పట్టించుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ఆ పార్టీతో కష్టమే అన్న పవన్ కళ్యాణ్.. టీఆర్‌‌ఎస్‌ క్యాండిడేట్‌కు మద్దతు ప్రకటించారు.

Also Read: సీఎం జగన్ ఆధీనంలోకి ‘విశాఖ’..!

అయితే.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జనసేనతో పొత్తుపై తాము ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు. బీజేపీ అన్యాయం చేస్తే తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని సంజయ్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన నాయకులతో చర్చిద్దామని కూడా చెప్పానని బండి సంజయ్ పేర్కొన్నారు. మొన్నటి వరకూ టీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థికే మద్ధతు ఇవ్వడంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. పవన్ కళ్యాణ్‌ తీరు సరిగా లేదని విమర్శించారు. ప్రజలు వ్యతిరేకించిన పార్టీకి పవన్ మద్దతిచ్చారని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Exit mobile version