
ఏపీలో తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోయింది. దీంతో భవిష్యత్పై ఆ పార్టీకి బెంగ పట్టుకుంది. అయితే.. ఎలాగూ ఎన్నికల్లో విజయం సాధించలేదు కాబట్టి.. కనీసం అధికార వైసీపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కూడా టీడీపీ ఎన్నో అగచాట్లు పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సరికే వైసీపీ దాదాపు 5 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. వీటిల్లో కొన్ని స్వీప్ అవ్వగా.. మరికొన్ని చోట్ల మాత్రం నామమాత్రపు ఎన్నికలు జరిగాయి.
Also Read: బ్రేకింగ్: అమరావతి భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులు
మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో అయినా పరువు కాపాడుకునేందుకు టీడీపీ నేతలు బాగానే కష్టపడ్డారు. ఇందుకు ఎక్కడికక్కడ సీక్రెట్ పొత్తులు పెట్టుకున్నారు. కొన్నిచోట్ల జనసేనతో పొత్తు పెట్టుకోవడం పార్టీ అగ్ర నాయకత్వానికి నచ్చకపోయినా స్థానిక నాయకులు తమకు తోచినట్టుగా పొత్తులు పెట్టేసున్నారు. కొన్నిచోట్ల సీట్లు త్యాగం చేయకపోతే పార్టీ బతికే పరిస్థితి లేకపోవడం.. మరికొన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో స్థానిక సర్దుబాట్లకు దిగని పరిస్థితి. కీలకమైన గ్రేటర్ విశాఖలో టీడీపీ మేయర్ పీఠం దక్కించుకుని మూడున్నర దశాబ్దాలే అయ్యింది.
గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో కార్మిక సంఘాలు ఎక్కువగా ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎంలకు కొన్ని డివిజన్లు కేటాయించింది. ఇక కొన్ని చోట్ల జనసేనతోనూ పొత్తు పెట్టుకుంది. పార్టీ బలంగా ఉన్న విజయవాడలో.. అందులోనూ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న తూర్పు నియోజకవర్గంలోనే కొన్ని డివిజన్లలో టీడీపీ పోటీ చేయకుండా జనసేన అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. గుంటూరు నగరంలో కొన్ని డివిజన్లలో రెండు పార్టీలు పోటీలో ఉన్నా జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ సైలెంట్ అవ్వడం, టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన సైలెంట్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..?
కొన్నిచోట్ల నియోజకవర్గాల ఇన్చార్జీలు, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వైసీపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు జనసేనతో ఇంటర్నల్ పొత్తులు పెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలుతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని మున్సిపాల్టీల్లో ఇదే పరిస్థితి ఉంది. మరికొందరు పార్టీ నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ ఈ పొత్తులు తప్పవని.. లేకపోతే టీడీపీలో ఉండి రాజకీయం చేయలేమని చెపుతున్న పరిస్థితి. 2024లో టీడీపీ పొత్తులతోనే ముందుకు వెళ్లాలన్నది చంద్రబాబు మదిలో ఉందో లేదో కాని.. స్థానిక నాయకులు, కేడర్ మాత్రం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్