లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకున్న ఏపీవాసులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారిని స్వస్థలాలకు తరలించే ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే.. స్వస్థలాలకు వెళ్లాక క్వారంటైన్ లో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు పొందే అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ తదితర హైఎండ్ సర్వీసుల్లో 50% ప్రయాణికులనే అనుమతిస్తారు. ఈ మేరకు సీట్ల అమరికను మార్చాలని సూచించినట్టు తెలుస్తోంది. దూర ప్రాంత బస్సుల్లో టికెట్లను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే, బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే వాటిని బస్టాండ్లో కండక్టర్లకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చార్జీ చెల్లించి ప్రయాణికులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీనగర్, మియాపూర్-బొల్లారం క్రాస్రోడ్, కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల నుంచి బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భౌతిక దూరం పాటిస్తూ 50 శాతం ప్రయాణికులతోనే బస్సులు నడపాలని భావిస్తోంది. రెండో దశలో బెంగళూరు, చెన్నై నుంచి బస్సులు నడపాలన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.