AP High Court: ఏదైనా పనిచేయాలంటే అనుభవమున్న వారి సలహా చాలా అవసరం. ఒక్క అనుభవశాలి ఇచ్చే సలహా..వంద మంది బలవంతుల పనితో సమానమంటారు. అందుకే కాబోలు ఏపీలో వైసీపీ సర్కారు 100 మందికిపైగా సలహాదారులను పెట్టుకుంది. వారికి జీతభత్యాలు, ఇతరత్రా వసతులకు నెలకు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతోంది. అయితే వీరిచ్చే సలహాలు ఏమిటో? ఆయా శాఖలు పాటిస్తున్నది ఏమిటో? మాత్రం తెలియడం లేదు. కానీ వారి సలహాలను పాలనలో వినియోగించుకుంటున్నట్టు మాత్రం వైసీపీ సర్కారు ఆర్భాటంగా ప్రకటిస్తోంది. దివంగత వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఒకరిద్దరు సలహదారులుండగా.. చంద్రబాబు సర్కారులో ఆ సంఖ్య రెండెంకలకు చేరుకుంది. ఇప్పుడది మూడంకెలకు దాటడం విశేషం. అంటే ప్రభుత్వాలు మారుతున్న కొలదీ సలహా దారుల సంఖ్య వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఏపీలో సలహదారుల పరిస్థి ఎలా ఉందంటే సలహదారులకే సలహా ఇచ్చేందుకు మరో సలహదారుడిని నియమించుకునే పరిస్థితి దాకా వెళ్లందన్నమాట. అందుకే సలహదారుల నియామకంలో హైకోర్టు గట్టిగానే మొట్టికాయ వేసింది. చివరకే అడ్వకేట్ జనరల్ కు సలహాదారుడ్ని నియమిస్తారా అంటూ ప్రశ్నించేదాకా వెళ్లిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

యంత్రాంగమున్నా…
ప్రభుత్వం ఉండేది పాలన కోసం. పాలకులు ప్రతిపాదనలు,ఆమోదం తెలిపితే యంత్రాంగం అమలుచేస్తోంది. పాలకులు, అధికారులు, ఉద్యోగుల సమన్వయంతోనే పాలన నడుస్తోంది. కానీ ఇప్పుడు వారికి సలహదారులు లేకపోతే పాలన నడవదన్న రేంజ్ లో వైసీపీ సర్కారు ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా వంద మందికి పైగా సలహాదారులను నియమించుకుంది. ఐఏఎస్ అధికారులతో సమానంగా జీతభత్యాలు, ఇతరత్రా వసతులను సమకూర్చుతోంది. వాస్తవానికి ప్రతీ శాఖకు ఒక మంత్రి ఉంటారు. ముఖ్య కార్యదర్శితో పాటు కమిషనర్ ఉంటారు. ఒక పెద్ద యంత్రాంగమే ఉంటుంది. ఆ శాఖ పరిధిలో పాలనా నిర్ణయాలు, కొత్త ప్రతిపాదనలు, పథకాలు రూపకల్పన వంటి అన్నింటినీ వారే రూపొందిస్తారు. ఐఏస్ లు, ఐపీఎస్ లు సైతం ప్రక్రియలో సహకరిస్తారు. ఇది ఇప్పటివరకూ ప్రతీ శాఖలో ఉండే పాలన ప్రక్రయ. అయితే ప్రత్యేక సందర్భాల్లో అయితే ఆ శాఖలో పదవీ విరమణ పొందిన అధికారులు, నిష్ణాతులైన వారిని సలహాదారులుగా నియమించుకున్న సందర్భాలు గత ప్రభుత్వాల్లో సైతం ఉన్నాయి. వీరు తమకు అప్పగించిన బాధ్యతలను చూసేవారు. సమస్యలపై అధ్యయనం చేసేవారు. మంత్రులు, సీఎం కు తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో అందించేవారు. వాటి పరిష్కార మార్గాలను చూపేవారు. అలాగని వీరు రాజకీయాంశాల్లో వేలు పెట్టేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సలహాదారులంటే ఒక ప్రత్యేక గౌరవం అప్పట్లో ఉండేది. రాజశేఖర్ రెడ్డి హయాంలో సలహదారుల సేవలు పరిమితంగా వినియోగించుకునేవారు. చంద్రబాబుకూడా అదే పరంపరను కొనసాగించారు.
వైసీపీతో సిన్ మారింది..
రాష్ట్రంలో వైసీపీ సర్కారు వచ్చింది. సలహదారుల నియామక ప్రక్రియ మారిపోయింది. అడ్డూ అదుపు లేకుండా వారి నియామకం ప్రారంభమైంది. చివరకు వారి జాబితా వందకు చేరుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ముగ్గరు, నీటి పారుదలశాఖకు ఇద్దరు, రాష్ట్రంలో ఏవియేషన్ అకాడమీలు లేకున్నా దానికి ఒకరు, డీజీపీ లీగల్ సేవల కోసం ముగ్గురు, విదేశాల్లో సైతం సేవలందించేందుకు మరికొందరు, ఇలా చెప్పకుంటూ పోతే మాత్రం చాంతాడంత ఉంది. కానీ ఎంతమంది సలహదారులున్నారో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించదు. కానీ ఎప్పటికప్పుడు నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇలా ప్రకటించిన వారిని క్రోడికరిస్తే మాత్రం వందకుపైగా సలహదారులు ఏపీలో ఉన్నట్టు వెల్లడవుతోంది. కానీ వారు ఎక్కడ పనిచేస్తున్నారో? ఏం సలహాలు ఇస్తున్నారో మాత్రం తెలియడం లేదు. తన రాజకీయ ఉన్నతికి ఉపయోగపడిన వారు, భవిష్యత్ లో ఉపయోగపడే కొంతమందిని సీఎం జగన్ సలహదారులుగా నియమించుకున్నారన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. ఇందులో విశేషమేమిటంటే కొందరు సలహదారులకు కేబినెట్ హోదాలు ఉన్నాయి. నెలకు రూ.3 లక్షల కంటే ఎక్కువగా జీతభత్యాలు దక్కుతున్నాయి. ఇందులో సీఎం జగన్ సొంత సామాజికవర్గం వారే అధికంగా ఉండడం విశేషం.

జీతభత్యాలతో సంతృప్తి..
చాలా మంది సలహదారులకు తాము నియమితులైన శాఖకు సంబంధించి కనీస అవగాహన లేదు. మరికొందరికి సలహదారులుగా పనిచేస్తామని ఉత్సాహం ఉన్నా అందుకు తగిన పరిస్థితులు లేవు. పోని కార్యాలయంలో కూర్చొని పనిచేసి ముచ్చట తీర్చుకుందామంటే సరైన ఆఫీసులు లేవు. అక్కడున్న అధికారులు, ఉద్యోగులే ఇరుకు గదుల్లో సర్దుకుంటే సలహదారులకు ప్రత్యేక చాంబర్లు అంటే ఎక్కడి నుంచి తెచ్చేది. అందుకే ఎక్కువ మంది సలహదారులు కారు నంబరు ప్లేటుపై ఉండే హోదాతో, నెలసరి వచ్చే జీతభత్యాలతో సంతృప్తి పొందుతున్నారు. మరికొందరైతే సలహదారుడితో పాటు పార్టీ సేవల్లో మునిగి తేలుతున్నారు.అయితే ఇలానే కొనసాగితే మాత్రం సలహదారులకు సలహా ఇచ్చే కొత్త సలహదారుడ్ని నియమించినా ఆశ్చర్యపోనవసరం లేదు.