తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మరోసారి తారస్థాయికి చేరేలాగనే కనిపిస్తోంది. ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ లో అక్రమంగా పనులు చేస్తోందని తెలంగాణ ఫిర్యాదులు చేసింది. తెలంగాణ సర్కారు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ కంప్లైంటు చేసింది. ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ సీఎం మౌనాన్నే ఆశ్రయించారు. దీనికి కారణమేంటనే చర్చ రాజకీయవర్గాలతోపాటు ప్రజల్లోనూ మొదలైంది.
దీనికి నిన్న (బుధవారం) జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సమాధానం ఇచ్చారు జగన్. తెలంగాణలో ఏపీ వాసులు ఉన్నారు కాబట్టి.. ఇప్పుడు మనం ఏదైనా గట్టిగా మాట్లాడితే.. అక్కడున్న మనవాళ్లను ఇబ్బంది పెడతారని, అందుకే.. సైలెంట్ గా ఉన్నామని జవాబు చెప్పారు. ఇది విన్నవాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణకు ఏపీ వాసులు ఇవాళ కొత్తగా వెళ్లారా? గత ప్రభుత్వ హయాంలో అక్కడ లేరా? పోనీ.. భవిష్యత్ లో అక్కడ ఉండరా..? ఈ లెక్కన ఇక ఎప్పటికీ జల వివాదం గురించి తెలంగాణ సర్కారును పల్లెత్తు మాట కూడా అనరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
నిజానికి ఇదే ముఖ్యమంత్రి.. నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. నీటి విషయంలో తెలంగాణ సర్కారు అన్యాయం చేస్తున్నా.. బాబు నోరు మూసుకొని ఉన్నారని, దీనికి ఓటు నోటు కేసే ప్రధాన కారణమని అన్నారు. ఆ కేసు కారణంగానే.. ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. బాబు నోరు మెదపట్లేదని ఎన్నో సార్లు వ్యాఖ్యానించారు. మరి, ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమస్య మళ్లీ వచ్చింది. దాని గురించి ఏం చేస్తున్నారో చెప్పకుండా.. ఎలా చేస్తారో చెప్పకుండా.. ఏపీ ప్రజలను ఇబ్బంది పెడతారనే మౌనంగా ఉన్నామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు జనం.
అసలు ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు తెలంగాణ సర్కారుపై ఇప్పటి వరకూ ఒక్క మచ్చ అయినా ఉందా? ఒక్క ఆధారమైనా ఉందా? అలాంటివి లేనప్పుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారనే ప్రశ్నకూడా ఉత్పన్నమవుతోంది. కనీసం.. కృష్ణాబోర్డు దగ్గరకు వెళ్తామనో, కేంద్ర జలసంఘం వద్దకు పంచాయితీని తీసుకెళ్తామనో.. తమకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయిలో నిలదీస్తామనో చెప్పకుండా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతర్యం ఏంటీ? అనే ప్రశ్న వస్తోంది.
దీన్నిబట్టి.. ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కారుపై తెలంగాణ చేస్తున్న విమర్శలు నిజమేనని అనుకోవాలా? అవి బయట పడతాయనే ప్రాంతీయ సెంటిమెంట్ వ్యాఖ్యలతో కవరింగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి, ఈ ప్రశ్నలకు అటు జగన్ కానీ.. వైసీపీ నేతలు కానీ.. ఎలాంటి సమాధానాలు చెబుతారో చూడాలి.