Homeజాతీయ వార్తలుKCR- Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మరో మాస్టర్‌ప్లాన్‌.. ఈసారైనా వర్కవుట్‌ అవుతుందా!!

KCR- Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మరో మాస్టర్‌ప్లాన్‌.. ఈసారైనా వర్కవుట్‌ అవుతుందా!!

KCR- Revanth Reddy: తెలంగాణలో పతనం అంచున ఉన్న కాంగ్రెస్‌ను పైకి లేపేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ మేరకు పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మరోమారు యుద్ధం చేయడానికి ప్లాన్‌ రెడీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. అధికార పార్టీపై అలుపెరుగని పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.

KCR- Revanth Reddy
KCR- Revanth Reddy

ప్రజా సమస్యలే ఎజెండాగా మరో పోరాటం..
తాజాగా గాంధీ భవన్‌ నుంచి జూమ్‌ మీటింగ్‌లో నేతలతో కీలక సమావేశం నిర్వహించిన రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో పలువురు సీనియర్‌ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో మాట్లాడారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల్లో ధరణి పోర్టల్‌పైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ధాన్యం కొనుగోలు సమస్యలపైన, పోడు భూముల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈమేరకు కార్యాచరణను కూడా రూపొందించి అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.

సక్సెస్‌ అవుతారా?
తాజా పోరాటంలో భాగంగా ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్‌ కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఇక రైతుల రుణమాఫీకి సంబంధించిన 25 వేల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులపై, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే అంశాలపై పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నో వ్యూహాలు చేస్తున్నా, ఏ మేరకు సక్సెస్‌ అవుతుంది అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.

KCR- Revanth Reddy
KCR- Revanth Reddy

నేతల మధ్య సమన్వయ లేమి..
కాంగ్రెస్‌ పార్టీ ఏ కార్యక్రమం చేసినా దానికి తగినట్టుగా ప్రతిఫలం రావడం లేదన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మన మునుగోడు మన కాంగ్రెస్‌ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఫెయిల్యూర్‌కు కారణంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్న రేవంత్‌ రెడ్డి, వరుసగా ఫెయిల్‌ అవుతూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీ బలోపేతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి రూపొందించుకున్న మాస్టర్‌ ప్లాన్‌ ఏ మాత్రం వర్క్‌అవుట్‌ అవుతుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version