Munugode Bypoll TRS- BJP: రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. దీన్ని అన్ని పార్టీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. 2024 ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్నాయి. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని పావులు కదుపుతున్నాయి. పోయిన పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తామే భర్తీ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో తీసుకోబోయే చర్యల గురించి చర్చించనున్నారు. ఇప్పటికే సర్వేలు చేయించుకున్న నేపథ్యంలో వాటిపై ప్రధానంగా చర్చించి టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై సమాలోచనలు చేయనున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా మునుగోడులో గెలిచి ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నేతల్లో సమన్వయం సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గ నేతలతో సమావేశం జరిపి అందరు ఐక్యంగా ఉండాలని సూచించినా వారిలో ఐక్యత మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. దీంతో గులాబీ పార్టీకి మింగుడు పడటం లేదు. బీజేపీ చేపట్టే ఆపరేషన్ ఆకర్ష్ కు నేతలు స్పందిస్తున్నారు. ఫలితంగా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Also Read: National surveys: సర్వేల ఘోష: వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందా? కాదా?
బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మునుగోడులో రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని మరోమారు బీజేపీ టికెట్ పై గెలిపించి కేసీఆర్ కు చాలెంజ్ విసరాలని ఉవ్విళ్లూరుతోంది. దుబ్బాక, హుజురాబాద్ లలో వచ్చిన ఫలితాలే ఇక్కడ కూడా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ ఉండటంతో చాలా మంది నేతలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ప్రణాళికలు రచించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి టీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు.
బీజేపీలో చేరాలని చూస్తున్న నేతలను అధికార పార్టీ పోలీసులతో బెదిరించాలని చూస్తోంది. ఈ మేరకు పార్టీ మారే నేతల ఇళ్లకు మఫ్టీలో పోలీసులు రావడాన్ని కొందరు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఇష్టమైన పార్టీలో ఉండే అధికారం ఉందని మీరు ఎంత బెదిరించినా వినేది లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి గుదిబండలా మారుతోంది. బీజేపీలో నేతలు చేరితే పరువు పోతుందనే వాదన టీఆర్ఎస్ లో వస్తోంది. అందుకే నేతలు వెళ్లకుండా చేయాలని సకల ప్రయత్నాలు చేస్తున్నా వారు మాత్రం ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో గులాబీ పార్టీకి నోట్లో వెలక్కాయ పడినట్లు అవుతోంది.
మొత్తానికి మునుగోడులో అధికార పార్టీకి తలవంపులు తెచ్చేలా ఉందని తెలుస్తోంది. మరోమారు ఓటమి పాలైతే ఇక రాష్ర్టంలో మనుగడ ప్రశ్నార్థకమే అని చెబుతున్నారు. దీంతో మునుగోడు టీఆర్ఎస్ పార్టీని ముంచుతుందని విశ్వసిస్తున్నారు. దిద్దుబాటు చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలనే దానిపై తలలు పట్టుకుంటున్నారు.
Also Read:Ram Column: ఆంధ్ర రాజకీయాల్లో జగన్ ప్రభావం ఎందుకు తగ్గటం లేదు?