Indrakaran Reddy: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు క్యూ లైన్ లలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే అక్కడక్కడ వివాదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇంతలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు వివాదాస్పదమైంది. ఓటు వేయడానికి ఆయన పోలింగ్ కేంద్రానికి పార్టీ కండువా వేసుకొని రావడమే అందుకు కారణం.
నిర్మల్ నియోజకవర్గంలోని యల్లపల్లి ఆయన స్వగ్రామం. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఈ నెల 28 తో ప్రచారం ముగిసింది. పార్టీ గుర్తులు కనిపించేలా చేయడం, పలానా గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం కూడా కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే ఏకంగా మంత్రి పార్టీ కండువా తో పోలింగ్ కేంద్రానికి వెళ్లడం చర్చనీయాంశం అవుతుంది. దీనిపై ఈసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. బంజారాహిల్స్ లోని డిఏవి స్కూల్ పోలింగ్ స్టేషన్లో గురువారం ఉదయం ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల మాదిరిగా బిఆర్ఎస్ ను ఆదరించాలని ఆమె కోరారు. కోడ్ నిబంధనల ప్రకారం.. ప్రచారం ముగిసిన తర్వాత ఇలా విజ్ఞప్తి చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఎలక్షన్ కమిషన్ ను కోరారు. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు నేతల వ్యవహార శైలి ఈసీ ముందు ఉంది. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి?