Fridge water health risks: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి వాతావరణం కోరుకుంటారు. ముఖ్యంగా ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల దాహం వేస్తే చల్లటి నీరు తాగాలని కోరుకుంటారు. దీంతో చాలామంది ఫ్రిజ్లో ఉంచిన చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ తాగాలని కోరుకుంటారు. దీంతో తక్షణ ఉపశమనం పొందవచ్చని చూస్తారు. కానీ కొంతమంది వైద్యులు చెబుతున్న ప్రకారం.. చల్లటి నీటిని తరచుగా తాగడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?
మన శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. ఇలాంటి సమయంలో సాధరణ నీరు తీసుకుంటే త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కవ చల్లటి నీరు తాగితే కడుపులోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీంతో జీర్ణక్రియ మందగించి ఆహారం సరిగా జీర్ణం కాలేదు. దీంతో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. ఐస్ నీరు గొంతులోని శ్లేష్మ పొరపై ప్రభావం చూపుతుంది. దీంతో గొంతు గరగర, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎండ నుంచి వచ్చి వెంటనే చల్లటి నీరు తాగితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వేసవిలో తిరగడం వల్ల శరీరం అప్పటికే అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా చాలా చల్లటి నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారుతుంది. దీనివల్ల కొందరికి తలనొప్పి, తిమ్మిరి, అలసట కలగొచ్చు. చల్లటి నీరు రక్తనాళాలను తాత్కాలికంగా కుదించవచ్చు. దీంతో రక్తప్రసరణలో స్వల్ప అంతరాయం ఏర్పడి కొందరికి అసౌకర్యం కలగవచ్చు. ఎక్కువ చల్లటి నీరు తాగినప్పుడు వెంటనే చల్లదనం అనిపించినా, శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అంతగా అందకపోవచ్చు. గది ఉష్ణోగ్రతలోని నీరు శరీరం సులభంగా స్వీకరిస్తుంది.
మరేం చేయాలి?
ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే కాకుండా కొద్దిసేపు బయట ఉంచిన నీరు తాగడం మంచిది. మట్టి కుండలోని నీరు ఉత్తమం. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీరు, మజ్జిగ వంటి సహజ శీతల పానీయాలు మంచివి అని వైద్యుల సూచన. ఎండలో నుంచి వచ్చి వెంటనే ఐస్ వాటర్ తాగడం కంటే 5 నుంచి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని తర్వాత సాధారణ చల్లదనంలో ఉన్న నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇలాంటి సమయంలో కొందరు శీతల పానీయాలు తాగాలని చూస్తారు. కానీ ఇవి కూడా మంచివి కావని వైద్యలు చెబుతున్నారు. వీటి స్థానంలో సాంప్రదాయ ద్రవపదార్థాలైన నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు తాగవచ్చని అంటున్నారు.