Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్‌.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశం..!

ప్రపంచాన్ని వైరస్‌లు వణికిస్తున్నాయి. మొన్నటి వరకు కరోనా భయపెట్టింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మంకీపాక్స్‌ బయపెడుతోంది. వేగంగా విస్తరిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : August 19, 2024 1:35 pm

Monkeypox

Follow us on

Monkeypox: ప్రపంచవ్యాప్తం మంకీపాక్స్‌ డేంజర్‌ బెల్స్‌మోగిస్తోంది. ఆఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌బారిన పడి ఇప్పటికే వందల మంది మరణించారు. తాజాగా మన దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్‌ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎంపాక్స్‌ వైరస్పై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తోడు కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణాంతక వైరస్‌ ఇండియాలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తాజాగగా అధికారులతో సమీక్షించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ పీకే మిశ్ర నేతృత్వంలోని అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. మంకీపాక్స్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించారు. ఈ వైరస్‌పై అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మోదీ ఆదేశించారు. వైరస్‌ను త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15,600 మంకీపాక్స్‌ కేసులు నమోదవగా.. 537 మందికి పైగా మృతి చెందారు.దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటి వకు ఒక్క మంకీ పాక్స్‌ కేసు కూడా నమోదు కాలేదని ప్రధాని తెలిపారు. ఆఫ్రికాలోని చాలా రాష్ట్రాల్లో మంకీపాక్స్‌ విస్తరిస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్‌గా ప్రకటించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.

త్వరగా ట్రేస్‌ చేసేలా..
మంకీపాక్స్‌ కేసులను త్వరగా ట్రేస్‌ చేసేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ.. ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. ముందస్తు వైరస్‌ నిర్ధారణ కోసం టెస్టింగ్‌ ల్యాబ్‌ను వెంటనే రెడీ చేయాలని సూచించారు. ప్రస్తుతం 32 ల్యాబ్‌లను టెస్టులను కోసం రెడీ చేశారని.. ఈ వైరస్‌ ను అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని మోదీ తెలిపారు. అంతేకాకుండా మంకీపాక్స్‌ లక్షణాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని ప్రధాని చెప్పారు.

ఆఫ్రికాలో విజృంభణ..
ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్‌ విజృంభిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా మంకీపాక్స్‌ సోకిన రోగుల సంఖ్య 18,737కి చేరింది. అయితే ఈ ఒక్క వారంలోనే 1,200 ఎంపాక్స్‌ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ప్రాణాంతకమైన క్లాడ్‌–1తో పాటు అన్ని రకాల వైరస్లతో కలిపి డబ్ల్యూహెచ్‌వో ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకూ 545 మరణాలు సంభవించాయి. కాంగోలో ఈ ఒక్క వారంలో 202 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది చనిపోయారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్‌ వైరస్‌ కేసుల్ని గుర్తించగా.. మరణాల రేటు 8.2 శాతంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వీక్లో 39 కేసులు నిర్ధారణవగా.. ఆఫ్రికా వెలుపల ఉన్న పాకిస్తాన్‌లో కూడా మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూడటం ఇప్పుడు కలవరం రేపుతోంది.