గ్రేటర్ లో ‘టీఆర్ఎస్’ కే పట్టం.. ఎందుకు?

తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వ్యతిరేకత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దుబ్బాకలో అందుకే సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. కేసీఆర్ కు ప్రచారం చేసుకోవడానికి పెద్దగా టాపిక్స్ దొరకలేదు. ఒక్క రైతులు, పింఛన్ దారులు, గ్రామస్థులు తప్పితే ఆయన పాలనపై మిగతా వారు ఎవ్వరూ సంతోషంగా లేరన్నది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ వచ్చి ఆరున్నర ఏళ్లు అయినా కేసీఆర్ సార్.. విద్యా, ఉద్యోగాలను పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ఇక ఉద్యోగులు, టీచర్లు పీఆర్సీ, […]

Written By: NARESH, Updated On : December 3, 2020 8:38 pm
Follow us on

తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వ్యతిరేకత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దుబ్బాకలో అందుకే సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. కేసీఆర్ కు ప్రచారం చేసుకోవడానికి పెద్దగా టాపిక్స్ దొరకలేదు. ఒక్క రైతులు, పింఛన్ దారులు, గ్రామస్థులు తప్పితే ఆయన పాలనపై మిగతా వారు ఎవ్వరూ సంతోషంగా లేరన్నది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ వచ్చి ఆరున్నర ఏళ్లు అయినా కేసీఆర్ సార్.. విద్యా, ఉద్యోగాలను పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ఇక ఉద్యోగులు, టీచర్లు పీఆర్సీ, టీఏ, డీఏల కోసం పిట్టకు పెట్టినట్టు ఎదురుచూస్తున్నారు. అసలు వీరి మొర ఆలకించేవారే లేరు. కోపంతో రగిలిపోతున్న టీచర్లను అందుకే కేసీఆర్ తెలివిగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో దూరం పెట్టారన్న టాక్ ఉంది.

ఉద్యోగాలు ఇవ్వలేదు… నిరుద్యోగులను పట్టించుకోలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన పోరగాళ్లకు కేసీఆర్ ఏం చేయలేదు. అందుకే యువకుడు ఉత్సాహవంతుడైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కోసం యువత ప్రాణం ఇస్తోంది. ఆయన వెంట నడుస్తోంది. నిజానికి కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం పెద్దగా ఉద్దరించింది లేదు అన్నది జనాల్లో ఉన్న అభిప్రాయం. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అక్కడ మున్సిపాలిటీ స్మార్ట్ సిటీ పనులతో అత్యంత ఆధ్వానంగా మారినా పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. కరీంనగర్ పార్లమెంట్ లోనూ పెద్దగా అభివృద్ధి లేదు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పనులే నత్తనడకన నడుస్తున్నాయి. అయితే వివాదాస్పద అంశాలు, హిందుత్వ వ్యాఖ్యలతో బండి రెచ్చగొడుతూ ఆ పోరాట పటిమ అయితే రగిలించగలుగుతున్నాడు.

తెలంగాణ అంతటా జనాలు అదే ఆలోచిస్తున్నారు. కేసీఆర్ చేయడం లేదు.. మోడీ ఇంకా పట్టించుకోవడం లేదు. అందుకే ఏ రాయితో కొట్టుకుంటే ఏందనేది గ్రేటర్ ప్రజలు బాగా ఆలోచించినట్టున్నారు. అధికారంలో ఉన్న గులాబీ రాయితోనే పళ్లు రాలగొట్టుకుంటే కాస్త నయం అనుకున్నట్టున్నారు. అందుకే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. అలాగని ఏకపక్షంగా టీఆర్ఎస్ ను గెలిపిస్తే కళ్లు నెత్తికెక్కి జనాలను పట్టించుకోరని.. దయతలిచి బీజేపీకి ముచ్చటగా ముప్పై సీట్ల వరకు విదిల్చారని తెలుస్తోంది.

ఇలా గ్రేటర్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు టీఆర్ఎస్ గెలుపుపై మేధావులంతా బుర్రలు బద్దలుకొట్టుకొని టీఆర్ఎస్ గెలుపుపై తమకు తోచిన అంచనాలు వెలువరుస్తున్నారు.

జీహెచ్ఎంసీలో ఓటేయకుండా ఆంధ్రా ఓటర్లు, యువత, ఉద్యోగులు పూర్తి దూరంగా ఉండడంతో వారి ఓట్లు పడాల్సిన బీజేపీ వెనుకబడింది. సంప్రదాయంగా ఉండే బస్తీవాసులు, పేదలు టీఆర్ఎస్ కే ఓటు వేయడంతో ఆ పార్టీనే గెలవబోతోందని అర్థమవుతోంది. సంక్షేమ పథకాలు అందుకున్న పేద, మధ్యతరగతి వారే ఓట్లు వేయడంతో ఈ పరిస్థితి మారిందని తెలుస్తోంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులు కనుక బద్దకం వీడి ఓటేస్తే బీజేపీకి ప్లస్ అయ్యేది. కానీ హైదరాబాద్ ఆధునిక యువతకు ఓటు వేసేంత తీరికలేదు కదా.. అదే బీజేపీ పాలిట శాపమైంది. వరుస సెలవులు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ వారిని వ్యూహాత్మకంగా సెలవుల పేరుతో నగరం దాటించి ఎంజాయ్ చేయడానికి పంపించేసిందన్న టాక్ ఉంది.

కేసీఆర్ లెక్కలేసి కేవలం 13రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేసి బీజేపీని .. జనాలను సర్దుకోకుండా చేసి ఈ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలను మాత్రం కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడన్నది వేచిచూడాలి. గుడ్ లక్ కేసీఆర్..!

-నరేశ్