జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: కేటీఆర్ సీఎం, కేసీఆర్ పీఎం కల చెదిరినట్టేనా?

జీహెచ్ఎంసీ ఫలితాలతో ఒకటి మాత్రం స్పష్టమైంది. ఇక తెలంగాణలో సెంటిమెంట్ కు తావులేదని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇదే భావోద్వేగంతో సాధించిన కేసీఆర్ కు బలమైన ఈ అస్త్రం దూరమైపోయింది. ఇక అభివృద్ధి, సంక్షేమ కోణమే ప్రజల్లో ప్రధాన ఎజెండా కానుంది. పనిచేసే వారికే పట్టం కట్టనున్నారు. ప్రజలతో మెలిగే వారినే ఆదరించనున్నారు. ఆహంకారంతో విర్రవీగితే కర్రు కాల్చి వాత పెడుతామని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితంతో నిరూపితమైంది. ప్రజలకు దూరమైన కేసీఆర్ ఇప్పుడైనా ప్రగతి భవన్ దాటి […]

Written By: NARESH, Updated On : December 5, 2020 10:21 am
Follow us on

జీహెచ్ఎంసీ ఫలితాలతో ఒకటి మాత్రం స్పష్టమైంది. ఇక తెలంగాణలో సెంటిమెంట్ కు తావులేదని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇదే భావోద్వేగంతో సాధించిన కేసీఆర్ కు బలమైన ఈ అస్త్రం దూరమైపోయింది. ఇక అభివృద్ధి, సంక్షేమ కోణమే ప్రజల్లో ప్రధాన ఎజెండా కానుంది. పనిచేసే వారికే పట్టం కట్టనున్నారు. ప్రజలతో మెలిగే వారినే ఆదరించనున్నారు. ఆహంకారంతో విర్రవీగితే కర్రు కాల్చి వాత పెడుతామని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితంతో నిరూపితమైంది. ప్రజలకు దూరమైన కేసీఆర్ ఇప్పుడైనా ప్రగతి భవన్ దాటి బయటకు రావాల్సిన టైం వచ్చేసింది.

Also Read: బ్రేకింగ్: గ్రేటర్ వార్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం.. ఉత్తమ్ రాజీనామా

దుబ్బాకలో ఓటమితోనే టీఆర్ఎస్ పతనం తెలంగాణలో మొదలైందని బీజేపీ శ్రేణులు తొడగొట్టారు. దీనికి ఒక్క సీటుకే ఎగిరిపడుతారా అని  కేసీఆర్, కేటీఆర్ అదిలించారు. కట్ చేస్తే.. బీజేపీ అదే ఊపులో జీహెచ్ఎంసీపై దండయాత్ర చేసి ఇప్పుడు హంగ్ సృష్టించింది. ట్రెయిన్ రివర్స్ అయ్యింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు గులాబీ పార్టీకి అంత ఈజీ కావన్న సంగతి తేటతెల్లమైంది. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయ శక్తిగా.. పక్కలో బల్లెంలో బీజేపీ తయారైంది.

వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటి ఈ పోరులో టీఆర్ఎస్ గెలిచింది 56 సీట్లు అయితే.. బీజేపీ 49 కొట్టుకొచ్చింది.. అంటే కేవలం 7 సీట్ల అంతరం మాత్రమే. రెండు పార్టీలకు పెద్ద తేడా లేదు.   గ్రేటర్ లో హంగ్ ఇచ్చి ఓ రకంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినట్టే లెక్క. పోయినసారి కేవలం 4 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీకి ఇప్పుడు దాదాపు 49 సీట్లు ఇచ్చారంటే నైతిక విజయం బీజేపీదే.

రెండు సార్లు ఇప్పటికే సీఎంగా తెలంగాణను ఏలిన కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి అధికారం సాధించి కొడుకు కేటీఆర్ ను సీఎం చేసి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయాలని కలలు గంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ కలలు కల్లలు అయ్యేలా బీజేపీ చేస్తోంది. ఈ సంగతి ముందుగానే తెలిసిందేమో కానీ.. బీజేపీలోని టాప్ 3 కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్ వచ్చారు. మోడీ వ్యాక్సిన్ పరిశీలనకు రాగా.. నంబర్ 2 అమిత్ షా హైదరాబాద్ లో ప్రచారం చేశాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అయితే ఇక్కడ ఎక్కువగానే తిరిగారు.

Also Read: జీహెచ్ఎంసీలో హంగ్.. మేయర్ పీఠం ఎవరికి?

మొత్తంగా టీఆర్ఎస్ కు దగ్గరగా సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణలో ఇప్పటివరకు అన్ని స్థానాల్లో గెలిపించిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు తన పక్క నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను గెలిపించలేకపోయారు. ఇక పోయిన సారి గ్రేటర్ లో 99 సీట్లు కొట్టిన కేటీఆర్ ఈసారి తనే బాధ్యత తీసుకొని బొక్క బోర్లాపడ్డారు.

అంటే హరీష్, కేటీఆర్.. ఇప్పుడు కేసీఆర్ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసినా టీఆర్ఎస్ కు ఓట్లు రాలలేదు. కేసీఆర్ ను జాతీయ రాజకీయాలకు పోకుండా బీజేపీ ఢిల్లీ నేతలు గల్లీకి వచ్చి ప్రచారం చేస్తున్నారని మొన్న సభలో గులాబీ దళపతి వాపోయాడు. చూస్తుంటే బీజేపీ ప్లాన్ అదేనేమోనని తెలుస్తోంది. అందుకే బీజేపీ దండయాత్రలో తెలంగాణలో కమలం వికసించింది. ఇప్పుడు వచ్చేసారి తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా సాగనుంది.

ఈ పరిణామం కాబోయే సీఎంగా కీర్తినందుకుంటున్న కేటీఆర్ కు శరాఘాతంగా మారింది. ఇంత చేసినా జీహెచ్ఎంసీలో గెలవలేకపోయిన టీఆర్ఎస్ కు ఈ ఓటమి   ఓ గుణపాఠంగా మారింది. కేటీఆర్ సీఎం ఆశలను చిదిమేసేలా ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పెద్ద దెబ్బగా పరిణమించింది. మరి ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన గులాబీ దళపతి కేసీఆర్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడు.. రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తం అవుతాడు? అసలు పార్టీని మళ్లీ నిలబెడుతాడా? ప్రజల్లో విశ్వాసం సంపాదిస్తాడా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

-నరేశ్