Kangana Ranaut: చెంప దెబ్బ తిన్న తర్వాత.. కంగనాకు షబానా అజ్మీ మద్దతు.. బద్ధ శత్రువులు భలే కలిసిపోయారుగా..

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బతిన్న తర్వాత కంగనాకు బాలీవుడ్ నుంచి కొంతమంది సంఘీభావం తెలిపారు. అందులో ప్రముఖ నటి షబానా ఆజ్మీ ఉన్నారు. ఆమె కంగనాకు సంఘీభావం తెలపడంతో బాలీవుడ్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 11, 2024 9:55 am

Kangana Ranaut

Follow us on

Kangana Ranaut: గతవారం చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బతిన్న తర్వాత.. బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ కు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు.. తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. “రేపటి నాడు మీకు కూడా ఇదే గతి పడుతుందని” తోటి నటులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అయితే కంగనాకు బాలీవుడ్ నుంచి కాస్తలో కాస్త మద్దతు లభించింది. ఇంతకీ ఆ మద్దతు ఇచ్చింది ఎవరంటే.

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బతిన్న తర్వాత కంగనాకు బాలీవుడ్ నుంచి కొంతమంది సంఘీభావం తెలిపారు. అందులో ప్రముఖ నటి షబానా ఆజ్మీ ఉన్నారు. ఆమె కంగనాకు సంఘీభావం తెలపడంతో బాలీవుడ్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఎందుకంటే కంగనాకు, షబానాకు ఏళ్ల నుంచి వైరం ఉంది..” కంగనా అంటే నాకు ప్రేమ లేదు. ఆమెపై జరిగిన హింసకు సంబంధించి కొంతమంది వేడుకలు జరుపుకోవడం తనకు నచ్చలేదని” షబానా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కంగనాకు, షబానాకు మధ్య వైరం ఈనాటిది కాదు. 2017లో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో పద్మావత్ అనే సినిమా విడుదలైంది. ఇందులో రాణి పద్మిని పాత్రలో దీపిక పదుకొనే నటించింది. ఆ పాత్రలో నటించినందుకు గానూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇందుకు పరిహారంగా దీపిక ముక్కు కోస్తామని రాజ్ పూత్ కర్ణి సేన బెదిరించింది. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానికి షబానా ఆజ్మీ నేతృత్వంలోని మహిళా నటీమణులు లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేయాలని కోరితే కంగనా నిరాకరించారు..” షబానా ఆజ్మీ నేతృత్వంలో రాసిన లేఖ రాజకీయ ప్రేరేపితమని” కంగనా వ్యాఖ్యానించింది. ఇది అటు కంగనా, ఇటు షబానా ఆజ్మీ మధ్య వివాదానికి కారణమైంది.

ఈ ఘటన కంటే ముందు హృతిక్ రోషన్ తో కంగనా గొడవ పడింది. సుశానే కు విడాకులు ఇచ్చిన తర్వాత హృతిక్ కంగనాకు దగ్గరయ్యాడు.. వారిద్దరూ చాలా రోజులపాటు సహజీవనం కొనసాగించారు. అయితే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని కంగనా హృతిక్ పై ఆరోపణలు చేసింది. ఆ సమయంలో కంగనాను నిశ్శబ్దంగా ఉండాలని షబానా అజ్మీ, జావేద్ అఖ్తర్ కోరారు.. లేనిపక్షంలో కెరియర్ నాశనం అవుతుందని హెచ్చరించారు..” నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షబానా నాకు మద్దతు పలకలేదు. పైగా నన్ను అణిగి ఉండమని చెప్పింది. దీపిక విషయంలో మాత్రం ఆమె మరో విధంగా స్పందించింది. రాజకీయ ధోరణికి తగ్గట్టుగానే ఆమె అడుగులు వేసిందని” అప్పట్లో కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇక బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఓ వార్త ఛానల్ కు కంగనా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో సుశాంత్ మరణం లో జావేద్ అఖ్తర్ పేరును ప్రస్తావించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.. దీంతో జావేద్ కంగనా పై కోర్టులో ఫిర్యాదు చేశాడు.. అదే కోర్టులో జావేద్ పై కంగనా కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేసింది. “2016లో నా ఇంట్లో కి జావేద్ వచ్చారు. ఓ సహ నటికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నన్ను నేరపూరితంగా బెదిరించారని” కంగనా తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించింది. ఫలితంగా ఇరుపక్షాలు రాజీకూర్చుకొని వివాదానికి ఫుల్ స్టాప్ వేశాయి.

ఇక అప్పటినుంచి షబానా అజ్మీ, జావేద్, కంగనా కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాపై దాడి జరగడం.. దానిని నిరసిస్తూ కంగనాకు షబానా సంఘీభావం తెలిపింది. దీంతో బాలీవుడ్ లో మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటన ద్వారా బద్ధ శత్రువులు ఒకటైపోయారని బాలీవుడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై బాలీవుడ్ అగ్రనటులు ఇంతవరకు పెదవి విప్పలేదు.