దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానంలో.. జూలై 27 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. కుంద్రాతోపాటు అతని ఐటీ చీఫ్ ర్యాన్ తోర్పేకు సైతం ఇదే తీర్పు అప్లై చేసింది. అయితే.. ఈ విషయమై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శిల్పాశెట్టి.. తొలిసారిగా నోరు విప్పారు.
నిన్న ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయమై పరోక్షంగా స్పందించారు శిల్పా. ప్రఖ్యాత రచయిత జేమ్స్ థర్బర్ మాటలను కోట్ చేస్తూ.. తన ఫీలింగ్స్ ను పరోక్షంగా బయటపెట్టారు. ‘‘ఆవేశంతో గతాన్ని, భయంతో భవిష్యత్ ను చూసుకోవద్దు. కానీ.. నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించుకో’’అంటూ.. తన పరిస్థితిని ఎమోషనల్ గా రివీల్ చేశారు.
‘‘వ్యతిరేక పరిస్థితుల వల్ల మనం కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారిని చూస్తే.. అనవసరమైన ఆందోళనకు గురవుతాం. ఆ పరిస్థితుల వల్ల ఏర్పడే భయాందోళనల వల్ల మన పని స్తంభించిపోతుంది. లేదంటే.. రోగాల బారిన పడతాం. చివరకు ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’’ అని కోట్ చేశారు. ఈ విధంగా.. భర్త కేసు విషయంలో పరోక్షంగా స్పందించిన శిల్పాశెట్టి.. ఇప్పుడు నేరుగా స్పందించినట్టు సమాచారం.
ఈ కేసు విషయమై జుహులోని ఆమె నివాసంలో.. ఆమెను పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలు తయారుచేసే విషయం తెలుసా? అని అడగ్గా.. దానికి ఆమె ‘నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. వీడియోలను హాట్ షాట్స్ యాప్ లో పోస్టు చేసే విషయం కూడా తనకు తెలియదని చెప్పినట్టుగా చెబుతున్నారు. అంతేకాదు.. తన భర్త రాజ్ కుంద్రా ఎలాంటి తప్పూ చేయలేదని కూడా వాదించినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం మొత్తం లండన్ లో ఉండే రాజ్ కుంద్రా బావ ప్రదీప్ బక్షి ఆధ్వర్యంలో జరిగేదని పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. తనతోపాటు తన భర్తకు ఈ విషయంతో సంబంధం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. దీంతో.. పోలీసులు ఏ దిశగా కేసును విచారిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే.. శిల్పాశెట్టి నటించిన హంగామా-2 చిత్రం శుక్రవారం విడులైంది. ఈ విషయమై ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన శిల్పా.. బయటి విషయాలు సినిమాను ప్రభావితం చేయొద్దని రాసుకొచ్చారు.